ఓ అధికారి అక్రమాల ఫైల్‌నూ తొక్కిపెట్టారు

ABN , First Publish Date - 2021-11-23T06:16:06+05:30 IST

ఉమ్మడి జిల్లాలోని సబ్‌రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఐదుగురు సబ్‌రిజిస్ట్రార్లపై రాష్ట్రస్థాయి అధికారులు సస్పెన్షన్‌ వేటువేశారు.

ఓ అధికారి అక్రమాల ఫైల్‌నూ తొక్కిపెట్టారు

ఓ ఇన్‌చార్జి సబ్‌రిజిస్ట్రార్‌ను కాపాడే యత్నం


నల్లగొండ, నవంబరు 22: ఉమ్మడి జిల్లాలోని సబ్‌రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఐదుగురు సబ్‌రిజిస్ట్రార్లపై రాష్ట్రస్థాయి అధికారులు సస్పెన్షన్‌ వేటువేశారు. ఇదిలా ఉండగా, తాజాగా నకిరేకల్‌ సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఓ ఉద్యోగి ఇన్‌చార్జిగా వ్యవహరించిన సమయంలో భారీగా అక్రమాలకు పాల్పడినట్లు వెలుగులోకి వచ్చింది. జూనియర్‌ అసిస్టెంట్‌గా ఉన్న ఆ ఓ ఉద్యోగికి ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించగా, గ్రామ పంచాయతీలో అనుమతి లేని లేఔట్లలోని ప్లాట్లను రిజిస్ట్రేషన్‌ చేశాడు. విచారణలో ఈ విషయాలు బయటపడగా, అతడిపై వేటు వేయాల్సి ఉన్నప్పటికీ ఓ అధికారి కాపాడేందుకు సదరు ఫైల్‌ను అటకెక్కించినట్లు సమచారం. సదరు ఉద్యోగి, అధికారి మధ్య డబ్బు చేతులు మారడం వల్లే ఇలా వ్యవహరించినట్టు ఆ శాఖలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ విషయం రాష్ట్రస్థాయి అధికారుల దృష్టికి ఇటీవల వెళ్లినట్లు సమాచారం. అతడిని సస్పెండ్‌ చేస్తూ ఆర్డర్‌ తయారుచేసి కూడా నిలిపివేసినట్లు చర్చ సాగుతోంది. ఇదిలా ఉండగా, భువనగిరి సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఇన్‌చార్జిగా వ్యవహరించిన ఉద్యోగి ఇటీవల సస్పెండ్‌ కాగా, తన ఒక్కడినే బలిచేయడం ఎంత వరకు సమంజసమని, ఓ అధికారి మాటలు నమ్మి తాను రిజిస్ట్రేషన్లు చేశానని వాపోతున్నట్లు తెలిసింది. అంతో ఇంతో తీసుకున్న అధికారి హాయిగా ఉండగా, తనను మాత్రం విధుల నుంచి తప్పించారని తోటి ఉద్యోగుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం.


విచారణ నివేదిక అందలేదు : ప్రవీణ్‌కుమార్‌, ఉమ్మడి జిల్లా రిజిస్ట్రార్‌

నకిరేకల్‌ సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్‌లో అక్రమాలు చోటు చేసుకున్న విషయం నా దృష్టికి వచ్చింది. దీనిపై విచారణకు ఆదేశించాం. ఆ విచారణకు సంబంధించి నివేదిక ఇంకా అందలేదు. అవినీతి విషయం విచారణలో తేలితే శాఖాపర చర్యలు తీసుకుంటాం.


Updated Date - 2021-11-23T06:16:06+05:30 IST