కదిరిలో ఆర్ట్స్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ ఘరానా మోసం
ABN , First Publish Date - 2021-12-14T16:59:21+05:30 IST
పేద ప్రజలే టార్గెట్గా కదిరిలో ఆర్ట్స్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ పద్మశ్రీ ఘరానా మోసానికి పాల్పడ్డారు.
అనంతపురం: పేద ప్రజలే టార్గెట్గా కదిరిలో ఆర్ట్స్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ పద్మశ్రీ ఘరానా మోసానికి పాల్పడ్డారు. సిగ్మాసిక్స్ ఎంటర్ ప్రైజెస్ ద్వారా ప్రభుత్వ కాలేజ్ల ఎక్విప్మెంట్ కొనుగోలుకు పెట్టుబడులు పెట్టి లాభాలు తీసుకోండంటూ పద్మశ్రీ నమ్మబలికి చేతులెత్తేశారు. మొదట్లో కొంత మొత్తాన్ని ఎరగా వేసి ఆశ కల్పించడంతో మహిళలు మోసపోయారు. పలువురు మహిళల నుండి కోట్ల రూపాయలు దండుకొని అసలుకే ఎసరు పెడుతున్నారని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ ఒంటిపై ఉన్న నగలు కూడా తాకట్టు పెట్టి ఉన్న డబ్బులు మొత్తం ఇచ్చేసి రోడ్డు పడ్డామని, తమకు ఆత్మహత్యలే శరణ్యమంటూ రోధిస్తున్నారు. వైస్ ప్రిన్సిపాల్ పద్మశ్రీ ఇంటి ముందు బైఠాయించి బాధిత మహిళలు ఆందోళనకు దిగారు. కాగా పద్మశ్రీ అందుబాటులో లేకుండా పోయారు. వైస్ ప్రిన్సిపాల్ పద్మశ్రీ స్నేహితురాలు షమీమ్ ద్వారా పరిచయమై మహిళలు డబ్బులు ఇచ్చిన్నట్లు తెలుస్తోంది. అయితే పద్మశ్రీని నమ్మి తాను కూడా మోసపోయానని షమీమ్ తెలిపారు. పద్మశ్రీ తమ్ముడు మహేష్, అతని సతీమణి ప్రత్యూష కూడా రియల్ ఎస్టేట్ పేరుతో కోట్లు దండుకున్నారని బాధితులు వాపోయారు.