ఎవడూ మిగలడు.. క్లియరెన్స్ ఇస్తే... వయలెన్సే..!

ABN , First Publish Date - 2021-08-04T06:58:34+05:30 IST

నాకు వయలెన్స్ (హింస) చేయడానికి..

ఎవడూ మిగలడు.. క్లియరెన్స్ ఇస్తే... వయలెన్సే..!

ఎన్ఎస్ గేటు వద్ద వెలిసిన అధికార పార్టీ నేత ఫ్లెక్సీ

సోషల్‌ మీడియాలో వైరల్‌.. పోలీసుల జోక్యంతో తొలగింపు


అనంతపురం(ఆంధ్రజ్యోతి): ‘నాకు వయలెన్స్ (హింస) చేయడానికి క్లియరెన్స్ దొరికితే... ఇక్కడ న్యూసెన్స్ చేయడానికి ఎవడూ మిగలడు’ ఇదేదో సినిమా డైలాగ్‌ అనుకుంటే పొరబడినట్లే. ఈ డైలాగ్‌తో రాప్తాడు నియోజకవర్గంలోని చెన్నేకొత్తపల్లి మండలం ఎన్ఎస్ గేటు సమీపంలో అధికార పార్టీకి చెందిన ఓ మండల కన్వీనర్‌ పేరుతో వెలిసిన ఫ్లెక్సీ అది. ఆ ఫ్లెక్సీని మంగళవారం ఉదయం 10 గంటల సమయంలో ఆ ప్రాంతంలో ఏర్పాటు చేశారు. వైసీపీ జెండా కలర్లతో ఫ్లెక్సీని ఏర్పాటు చేసి కుడిఎడమలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డి ఫొటోలతోపాటు స్థానిక ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి నిలువెత్తు ఫొటో ముద్రించారు. కుడివైపు వైసీపీ రామగిరి మండల కన్వీనర్‌ పి. రమేష్‌ ఫొటో ఉంది.


అంటే రామగిరి మండల కన్వీనర్‌ పి. రమేష్‌ ఈ ఫ్లెక్సీని అక్కడ ఏర్పాటు చేయించినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. ఆ ఫ్లెక్సీ అక్కడ ప్రత్యక్షం కాగానే... సోషల్‌ మీడియాలో క్షణాల్లో వైరల్‌ అయింది. వయలెన్స్ చేయడానికి క్లియరెన్స్ దొరికితే ఇక్కడ న్యూసెన్స్ చేయడానికి ఎవడూ మిగలడనే సంకేతాన్ని ఆ ఫ్లెక్సీ ద్వారా ఇస్తున్నారంటే.. అధికార పార్టీ నేతల దర్పం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. ప్రత్యర్థుల్లో భయాన్ని రేకెత్తించే విధంగా ఆ ఫ్లెక్సీ ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఫ్లెక్సీ సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో డీఎస్పీ.. చెన్నేకొత్తపల్లి పోలీసులను అప్రమత్తం చేశారు. మధ్యాహ్నం ఆ ఫ్లెక్సీని పోలీసులు తొలగించడం గమనార్హం. ఇలాంటి వివాదాస్పద ఫ్లెక్సీని ఏర్పాటు చేసిన వారిపై ఏ మేరకు చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే.


Updated Date - 2021-08-04T06:58:34+05:30 IST