చరిత్ర పుటల్లోకి ఆంధ్రా బ్యాంక్‌!

ABN , First Publish Date - 2020-03-31T06:37:50+05:30 IST

ఆంధ్రా బ్యాంక్‌ కథ నేటితో కంచికి చేరుతోంది. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు డాక్టర్‌ భోగరాజు పట్టాభి సీతారామయ్య 1923 నవంబరులో ప్రైవేటు బ్యాంకుగా...

చరిత్ర పుటల్లోకి  ఆంధ్రా బ్యాంక్‌!

  • తొమ్మిది దశాబ్దాలకుపైగా సేవలు
  • రేపు యూనియన్‌ బ్యాంకులో విలీనం 


ఆంధ్రా బ్యాంక్‌ కథ నేటితో కంచికి చేరుతోంది. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు డాక్టర్‌ భోగరాజు పట్టాభి సీతారామయ్య 1923 నవంబరులో ప్రైవేటు బ్యాంకుగా ఆంధ్రా బ్యాంక్‌ను స్థాపించారు. డిపాజిట్లు రూ.50 కోట్ల కంటే కొద్దిగా తక్కువగా ఉండడంతో 1969లో జాతీయకరణను తప్పించుకుంది. ఇందిరా గాంధీ రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత 1980 ఏప్రిల్‌లో మాత్రం ఆంధ్రా బ్యాంక్‌ జాతీయకరణను తప్పించుకోలేకపోయింది. బుధవారం (ఏప్రిల్‌ 1) నుంచి మరో ప్రభుత్వ రంగ బ్యాంకు (పీఎ్‌సబీ) యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (యూబీఐ)లో విలీనమవుతూ తన ఉనికినే కోల్పోతోంది. ఆంధ్రా బ్యాంక్‌తో పాటు కార్పొరేషన్‌ బ్యాంక్‌ యూబీఐలో విలీనమవుతోంది. 


ఆంధ్రా బ్యాంక్‌ చరిత్ర 

  • 20-11-1923న నమోదు
  • 28-11-1923 నుంచి బ్యాంకింగ్‌ కార్యకలాపాలు
  • 1969-1980 మధ్య దేశంలో నెంబర్‌వన్‌ ప్రైవేటు బ్యాంక్‌గా గుర్తింపు
  • 15-4-1980లో జాతీయకరణ
  • 2019 మార్చి నాటికి 26 రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో 2,885 శాఖలు, 3,798 ఏటీఎంలు
  • 1981లో దేశంలో తొలిసారిగా క్రెడిట్‌ కార్డుల వ్యాపారం ప్రారంభం 
  • 01-04-2020న యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో విలీనం


ఆస్తులూ అమ్మేస్తాం 

విలీనం తర్వాత ఆంధ్రా బ్యాంక్‌కు చెందిన కొన్ని స్థిరాస్తులను అమ్మేయాలని యూబీఐ నిర్ణయించింది. ఇందుకోసం ఇప్పటికే కొన్ని నివాస, వాణిజ్య సముదాయాల్ని గుర్తించినట్టు యూబీఐ ఎండీ, సీఈఓ రాజ్‌కిర ణ్‌ రాయ్‌ ప్రకటించారు. ఈ ఆస్తులతో పాటు ఇండి యా ఫస్ట్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ, మలేషియాలోని ఇండియా ఇంటర్నేషనల్‌ బ్యాంక్‌ మలేషియాలో ఉన్న వాటానూ విక్రయించాలని నిర్ణయించింది.


తెలుగు రాష్ట్రాల్లో సుపరిచిత బ్యాంక్‌గా

ఆంధ్రా బ్యాంక్‌ దాదాపు తొమ్మిది దశాబ్ధాలుగా తెలుగు నేలతో పాటు వివిధ రాష్ట్రాల్లో బ్యాంకింగ్‌ సేవలు అందించింది. అలాంటి బ్యాంక్‌ పేరు బుధవారం నుంచి చరిత్రలో కలిసిపోతోంది. విలీనాల ద్వారా పీఎ్‌సబీల బలోపేతం  పేరుతో తెలుగు ప్రజలతో ముడిపడి రెండు ప్రముఖ పీఎ్‌సబీలను కేంద్ర ప్రభుత్వం ఇతర పీఎ్‌సబీల్లో కలిపేస్తోంది. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ ఇప్పటికే స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ)లో కలిసిపోయింది. ఇప్పుడు తాజాగా ఆంధ్రా బ్యాంక్‌.. యూబీఐలో విలీనమవుతోంది. 


ఉద్యోగుల వ్యతిరేకత

కాగా యూబీఐలో విలీనాన్ని ఆంధ్రా బ్యాంక్‌ ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. పీఎ్‌సబీల బలోపేతానికి విలీనాలు పరిష్కారం కాదని, దీనివల్ల ఉద్యోగుల ఉద్యోగ భద్రతకూ ప్రమాదం ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విలీనం తర్వాత దాదాపు 700 శాఖలను హేతుబద్ధం చేయాల్సి ఉంటుందని యూబీఐ ఎండీ, సీఈఓ ప్రకటించడాన్ని వారు గుర్తు చేస్తున్నారు. కోవిడ్‌-19తో దేశం వణికిపోతున్నా, ప్రభుత్వం మొండి పట్టుదలతో ఆంధ్రా బ్యాంక్‌ను యూబీఐలో విలీనం చేయడాన్ని ఉద్యోగ సంఘాలు తీవ్రంగా తప్పుపట్టాయి. 


ఇక ఏపీ ఎస్‌ఎల్‌బీసీ యూబీఐ 

విలీనాలతో ఆయా రాష్ట్రాల స్టేట్‌ లెవల్‌ బ్యాంకర్స్‌ కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ) కన్వీనర్లు కూడా మారిపోయారు. ఏప్రిల్‌ 1 నుంచి యూబీఐ ఆంధ్రప్రదేశ్‌ ఎస్‌ఎ్‌సబీసీ కన్వీనర్‌గా వ్యవహరిస్తుంది. ఆర్‌బీఐ ఈ మేరకు ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు ఆంధ్రా బ్యాంక్‌.. ఆంధ్రప్రదేశ్‌ ఎస్‌ఎల్‌బీసీ కన్వీనర్‌గా వ్యవసహరించింది. విలీనంతో ఆ బాధ్యత ఇప్పుడు యూబీఐకి వచ్చింది.



Updated Date - 2020-03-31T06:37:50+05:30 IST