‘ఆంధ్రజ్యోతి’ పబ్లిషర్‌ కుమారుడి దుర్మరణం

ABN , First Publish Date - 2021-04-03T08:11:33+05:30 IST

: ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురణకర్త కోగంటి వెంకటశేషగిరిరావు కుమారుడు కోగంటి సతీశ్‌చంద్ర(37) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.

‘ఆంధ్రజ్యోతి’ పబ్లిషర్‌ కుమారుడి దుర్మరణం

  • రోడ్డు ప్రమాదంలో కోగంటి సతీశ్‌చంద్ర మృతి
  • సూర్యాపేట జిల్లా ముకుందాపురంలో ఘటన
  • వెంకటశేషగిరిరావుకు ప్రముఖుల పరామర్శ

కోదాడ/బంజారాహిల్స్‌, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురణకర్త కోగంటి వెంకటశేషగిరిరావు కుమారుడు కోగంటి సతీశ్‌చంద్ర(37) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా మునగాల మండలం ముకుందాపురం వద్ద 65వ నంబర్‌ జాతీయ రహదారిపై  జరిగిన ప్రమాదంలో ఆయన దుర్మరణం పాలయ్యారు. పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. సతీశ్‌చంద్ర వ్యాపార పని నిమిత్తం ఉదయం 6 గంటల సమయంలో హైదరాబాద్‌ నుంచి విజయవాడకు బయలుదేరారు. మునగాల మండలం ముకుందాపురం వద్ద కల్వర్టు సమీపంలో కారు ముందునుంచి వెళుతున్న కోదాడకు చెందిన శ్రీరాం ట్రాన్స్‌పోర్టు లారీ ఒక్కసారిగా స్లో అయింది. దీంతో వెనుక నుంచి కారు.. లారీని ఢీకొట్టింది. సతీశ్‌చంద్ర కారులోనే ఇరుక్కుపోయారు. అక్కడే ఉన్న స్థానికులు బయటకు తీసేలోగా ఆయన మృతి చెందారు. కారులో లభించిన ఆధారాల మేరకు ఆయనను ‘ఆంధ్రజ్యోతి’ పబ్లిషర్‌ వెంకటశేషగిరిరావు కుమారుడిగా గుర్తించి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 


అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శ్రీనివా్‌సనాయక్‌ తెలిపారు. సతీశ్‌చంద్రకు భార్య, కుమార్తె ఉన్నారు. ఆయన తండ్రి కోగంటి వెంకట శేషగిరిరావు.. ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణకు స్వయానా బావమరిది. సతీశ్‌చంద్ర.. ఈనాడు సర్క్యులేషన్‌ హెడ్‌ గద్దె సుధాకర్‌కు అల్లుడు. సతీశ్‌చంద్ర మృతితో ఫిలింనగర్‌లో విషాదఛాయలు అలముకున్నాయి. సతీశ్‌చంద్ర భౌతికకాయానికి ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ, వారి కుటుంబ సభ్యులు, ‘ఆంధ్రజ్యోతి’ సిబ్బంది నివాళులర్పించారు.


మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర్‌రావు, ఎన్టీవీ అధినేత తుమ్మల నరేంద్ర చౌదరి, పారిశ్రామికవేత్తలు దాసరి జై రమేశ్‌, జూబ్లీహిల్స్‌ హౌసింగ్‌ వెల్ఫేర్‌ సొసైటీ మాజీ అధ్యక్షుడు హన్మంతరావు, ఈటీవీ భారత్‌ హెడ్‌ బాపినీడు, ఈనాడు సంస్థల విభాగాధిపతులు.. శేషగిరిరావు, గద్దె సుధాకర్‌ కుటుంబాలను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. సతీశ్‌చంద్ర కళ్లను కుటుంబసభ్యులు దానం చేశారు. శుక్రవారం సాయంత్రం జూబ్లీహిల్స్‌ ప్రశాసన్‌నగర్‌లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించారు.  

Updated Date - 2021-04-03T08:11:33+05:30 IST