ఆంధ్రా పేపర్ మిల్లు కార్మికుల ధర్నా
ABN , First Publish Date - 2021-10-23T04:59:27+05:30 IST
ఆంధ్రా పేపర్ లిమిటెడ్ కడియం యూనిట్లో(ఎంఆర్ పాలెం) 27 నెలలు దాటినా అగ్రిమెంట్ పూర్తిచేయకుండా యాజమాన్యం మొండి వైఖరి ప్రదర్శిస్తోందని పేర్కొంటూ శుక్రవారం రాజమహేంద్రవరంలోని సహాయ కార్మికశాఖ కార్యాలయం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా నిర్వహించారు.
రాజమహేంద్రవరం అర్బన్, అక్టోబరు 22: ఆంధ్రా పేపర్ లిమిటెడ్ కడియం యూనిట్లో(ఎంఆర్ పాలెం) 27 నెలలు దాటినా అగ్రిమెంట్ పూర్తిచేయకుండా యాజమాన్యం మొండి వైఖరి ప్రదర్శిస్తోందని పేర్కొంటూ శుక్రవారం రాజమహేంద్రవరంలోని సహాయ కార్మికశాఖ కార్యాలయం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు, కడియం కోస్టల్ పేపర్స్ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేఎస్వీ రామచంద్రరావు మాట్లాడుతూ నూతన వేతన ఒప్పందం చేయాల్సిన యాజమాన్యం దాన్ని నిర్లక్ష్యం చేస్తూ నిరంకుశంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. తక్షణమే కార్మికశాఖ జోక్యం చేసుకుని కార్మికులకు నూతన వేతన ఒప్పందం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా, గత అగ్రిమెంట్లో రాసిన బోనస్ సీలింగ్ రద్దు చేసి చట్టప్రకారం మొత్తం జీతంపై 20 శాతం బోనస్ చెల్లించాలని కోరుతూ సహాయ కార్మిక అధికారి జే.గోపాలకృష్ణకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు పూర్ణిమరాజ్, యూనియన్ నాయకులు సా యిబాబు, విద్యాసాగర్, ఐఎన్టీయూసీ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.