రెండ్రోజులు లేటైతే ఇబ్బందేంటి?: ఆర్థిక మంత్రి బుగ్గన

ABN , First Publish Date - 2021-11-03T14:26:11+05:30 IST

‘ఒకవైపు ఒంటిపూట భోజనానికి ఇబ్బందిపడే కార్మికులు, చిరు వ్యాపారులు.. మరోవైపు జీతం రెండ్రోజులు ఆలస్యమైందంటున్న ఉద్యోగులు.. ఎవరికి ప్రాధాన్యమివ్వాలి? రెండ్రోజులు ఆలస్యమైనా జీతాలు ఇస్తున్నాంగా! ఇబ్బందేంటి’ అని ఆర్థిక, వాణిజ్య పన్నుల శాఖల..

రెండ్రోజులు లేటైతే ఇబ్బందేంటి?: ఆర్థిక మంత్రి బుగ్గన

ఆలస్యమైనా జీతాలిస్తున్నాంగా!

తమకే ఇబ్బందీ లేదని చాలా మంది ఉద్యోగులు చెప్పారు

అన్నీ గవర్నర్‌ పేరు మీదే నడుస్తాయి

బ్యాంకులతో ఒప్పందంపై ఆయనేం అడిగారో నాకు స్పష్టంగా తెలీదు

ప్రశ్నలు.. జవాబులు మామూలే

కాగ్‌ వందల ప్రశ్నలు వేస్తుంది

అడగడమే తప్పంటే ఎలా?

ప్రపంచమంతా అప్పులు చేస్తోంది

రుణాలు తేవడం పాలనలో భాగం

ఆర్థిక మంత్రి బుగ్గన వ్యాఖ్యలు


అమరావతి(ఆంధ్రజ్యోతి): ‘ఒకవైపు ఒంటిపూట భోజనానికి ఇబ్బందిపడే కార్మికులు, చిరు వ్యాపారులు.. మరోవైపు జీతం రెండ్రోజులు ఆలస్యమైందంటున్న ఉద్యోగులు.. ఎవరికి ప్రాధాన్యమివ్వాలి? రెండ్రోజులు ఆలస్యమైనా జీతాలు ఇస్తున్నాంగా! ఇబ్బందేంటి’ అని ఆర్థిక, వాణిజ్య పన్నుల శాఖల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రశ్నించారు. చాలా మంది ఉద్యోగులు తనతో మాట్లాడారని, రెండు రోజులు జీతం ఆలస్యం అవడం వల్ల వచ్చిన ఇబ్బందేమీ లేదని చెప్పారన్నారు. ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి నుంచి వాణిజ్య పన్నుల శాఖను తనకు అప్పగించాక బుగ్గన మంగళవారమిక్కడ వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. కొవిడ్‌ సమయంలో ప్రపంచమంతా అప్పులు చేస్తోందని, రాష్ట్రం కూడా చేసిందన్నారు. అప్పులు తేవడం కూడా పాలనలో ఒక భాగమని, సంక్షేమం కోసమే అప్పులు చేశామని తెలిపారు.


అప్పులు తేవడానికి బ్యాంకులతో చేసుకున్న ఒప్పందంలో వ్యక్తిగతంగా గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ పేరును చేర్చడంపై ప్రశ్నించగా.. ‘గవర్నర్‌ పేరుమీదే అన్నీ నడుస్తాయి. గత ప్రభుత్వంలోనైనా, ఇప్పుడైనా’ అని మంత్రి బదులిచ్చారు. గవర్నర్‌ వ్యవస్థ పేరు పెట్టొచ్చని, కానీ వ్యక్తిగతంగా ఎలా పేరు పెడతారు? దీనిపై గవర్నర్‌ కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి లేఖ రాశారు కదా అని అడుగగా.. ‘గవర్నర్‌ ఏమడిగారో నాకు స్పష్టంగా తెలీదు. అయినా అడగడం సాధారణం. దానికి వివరణ ఇస్తాం. పాలన అన్నాక ప్రశ్నలు అడగడం.. దానికి వివరణ ఇవ్వడం సాధారణం. ఏటా కాగ్‌ వందల ప్రశ్నలు అడుగుతుంటుంది. వాటికి సమాధానం ఇస్తుంటాం. ప్రశ్న అడగడమే తప్పంటే మరి గత ప్రభుత్వ హయాంలో కూడా కాగ్‌ వంద ప్రశ్నలు అడిగింది. తప్పు చేసినట్లేనా’ అని ప్రశ్నించారు.


బ్యాంకులతో అప్పుల ఒప్పందంలో గవర్నర్‌ పేరు చేర్చడంపై టీడీపీ రాజకీయం చేస్తోందని ఆరోపించారు. కొవిడ్‌ రెండేళ్లు ఉందని, ఫలితంగానే అందరినీ ఆదుకోవడానికి అప్పులు చేయాల్సి వచ్చిందన్నారు. ఎఫ్‌ఆర్‌బీఎం పరిధి 4 శాతానికి మించకూడదని, కానీ 11 శాతానికి వెళ్లిందని.. రేపు దీని మీదా ప్రశ్నిస్తారని, సమాధానం చెబుతామని తెలిపారు. వాణిజ్య పన్నుల శాఖను దళిత ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి నుంచి మీకు అప్పగించడంపై విమర్శలు వస్తున్నాయిగా అని ప్రశ్నించగా.. ‘నారాయణస్వామి పెద్ద మనిషి. శాఖ తీసేసినప్పుడు నాకు ఫోన్‌ చేశారు. ఇది ఆర్థిక శాఖలో ఉండాల్సిన శాఖే.. గతంలోనూ అలాగే ఉంది. ఇప్పుడు మీ శాఖను మీకే ఇచ్చేస్తున్నానని చెప్పారు. ఆయన పెద్దమనిషి కాబట్టే ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు’ అని బుగ్గన అన్నారు. మరో ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌ దగ్గరున్న స్టాంపులు, రిజిస్ర్టేషన్ల శాఖను కూడా ఆర్థిక శాఖలో చేర్చేస్తున్నారా అని ప్రశ్నించగా.. అవన్నీ మీ ఊహాగానాలేనని బదులిచ్చారు. జీఎ్‌సటీ పరిహారం కింద కేంద్రం నుంచి రూ.2వేల కోట్లు రావలసి ఉందని చెప్పారు.

Updated Date - 2021-11-03T14:26:11+05:30 IST