తూతూమంత్రంగా..

ABN , First Publish Date - 2021-10-17T05:32:37+05:30 IST

తూతూమంత్రంగా..

తూతూమంత్రంగా..
పుల్లూరు పంచాయతీలో నిధుల జాబితాను పరిశీలిస్తున్న అధికారులు

పంటల బీమా నిధుల స్వాహాపై విచారణ

అక్రమాలు తేలితే చర్యలు : జేడీ మోహనరావు

మైలవరం రూరల్‌, అక్టోబరు 16 : నివర్‌ తుఫాన్‌ కారణంగా నష్టపోయిన రైతులకు అందాల్సిన పరిహారాన్ని వైసీపీ నేతలు స్వాహా చేసిన వైనంపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించిన కథనానికి అధికారులు స్పందించారు. అయితే, రూ.కోట్లు స్వాహా చేసిన వైసీపీ నేతలకు నొప్పి తగలకుండా తూతూమంత్రంగా విచారణ చేసి మమ.. అనిపించారు. ఒక్క మైలవరం నియోజకవర్గంలోనే సుమారు రూ.4కోట్ల పైచిలుకు స్వాహా కాగా, జిల్లావ్యాప్తంగా రూ.30 కోట్ల పంటల బీమా నిధులను కాజేశారు. దీనిపై ఈనెల 12న ‘నివర్‌ కప్పిన నిజం’ శీర్షికన ఆంధ్రజ్యోతి కథనాన్ని ప్రచురించింది. స్పందించిన కలెక్టర్‌ నివాస్‌ సమగ్ర విచారణకు ఆదేశించారు. దీంతో వ్యవసాయ శాఖ అధికారులు శనివారం మైలవరం మండలం పుల్లూరులో పర్యటించారు. రైతులను పిలిచి విచారణ చేసి స్టేట్‌మెంట్‌ రికార్డు చేసుకున్నారు. తమ భూమిని వేరే వారి పేరుతో నమోదు చేయడమేమిటని నిలదీశారు. ఈ సందర్భంగా జేడీ మోహనరావు మాట్లాడుతూ పంటల బీమా పరిహారానికి సంబంధించిన జాబితాలను ముందే రైతు భరోసా కేంద్రాల వద్ద  ప్రదర్శించామని, అప్పట్లో ఎటువంటి ఆరోపణలు రాలేదన్నారు. మైలవరం వైసీపీ నేతలు తప్పుడు ఆధార్‌ కార్డులతో ఈ-క్రాప్‌ ఐడీలు సృష్టించి దోపిడీకి పాల్పడ్డారు. పత్తి పంట వేయకుండానే నష్టం జరిగిందంటూ లక్షల రూపాయలు దోచేశారు. ఇంత జరిగినా అధికారులు సమగ్రంగా విచారణ జరపాల్సింది పోయి తూతూమంత్రంగా ముగించారు. కేవలం 9 మంది రైతులను విచారణ చేసి వెళ్లిపోయారు. కొందరు అధికార పార్టీ నాయకులు అధికమొత్తంలో పంటల బీమా సొమ్ము స్వాహా చేశారని ఒక రైతు ఆరోపించారు. రైతు ఆరోపణలు విన్న కమిటీ సభ్యులు పూర్తిస్థాయి విచారణ చేసి నివేదికను ఉన్నతాధి కారులకు పంపుతామని చెప్పి మిన్నకుండిపోయారు. పండించిన పంటకు బదులు వేరే పంట నమోదు చేశారన్న ఆరోపణలపై ముమ్మరంగా విచారణ చేస్తున్నామన్న అధికారులు దాని సూత్ర ధారులు ఎవరన్న దానిపై మిన్నకుండిపోయారు. ఈ కార్య క్రమంలో వ్యవసాయశాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ మణిధర్‌, ఏడీఏ వెంకటేశ్వరరావు, వ్యవసాయాధికారి వేణుమాధవ్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-17T05:32:37+05:30 IST