అనిల్ ‘రిలయన్స్ సెంటర్’ ను ఎస్ బ్యాంక్ ఎంతకు కొనుగోలు చేసిందంటే...
ABN , First Publish Date - 2021-04-02T22:47:35+05:30 IST
అప్పులు చెల్లించేందుకు అనిల్ అంబానీ ఆస్తులను అమ్ముకుంటున్నాడు.
ముంబై : అప్పులు చెల్లించేందుకు అనిల్ అంబానీ ఆస్తులను అమ్ముకుంటున్నాడు. తాజాగా ‘రిలయన్స్ సెంటర్’ ప్రధాన కార్యాలయాన్ని రూ. 1,200 కోట్లకు విక్రయించాడు. అనిల్ అంబానీ ఆధీనంలో ఉండే రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ ఈ అమ్మకాన్ని నిర్వహించింది. వివరాలిలా ఉన్నాయి. అప్పుల్లో కూరుకుపోయిన కంపెనీని బయటపడేసేందుకు వేల కోట్ల విలువ చేసే తన ఆస్తిని అనిల్ అంబానీ అమ్మేశారు. ఈ ఏడాది జనవరిలో కూడా రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెండు ఆస్తులను విక్రయించింది.
ఢిల్లీ ఆగ్రా టోల్ రోడ్ను రూ. 3,600 కోట్లకు, పర్బతి కోల్డామ్ ట్రాన్స్మిషన్ కంపెనీ లిమిటెడ్ను రూ. 900 కోట్లకు విక్రయించిన సంగతి తెలిసిందే. రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా యెస్ బ్యాంకుకు రూ. 2 వేల కోట్ల వరకు బకాయి ఉంది. కాగా... అప్పులను తీర్చిన ప్రకటన వచ్చిన అనంతరం కంపెనీ షేర్ ధర ఒక్కసారిగా దూసుకెళ్లింది. పది శాతం వరకు ర్యాలీ చేసిన తర్వాత మిడ్-సెషన్ సమయంలో 7.98 శాతంతో ఇంట్రాడే గరిష్ఠ స్థాయిల వద్ద ట్రేడయింది. ఇదిలా ఉంటే.. ఈ కార్యాలయాన్ని తన కార్పొరేట్ ప్రధాన కార్యాలయంగా వినియోగించనున్నట్టు యెస్ బ్యాంకు పేర్కొంది. బ్యాంకుకు చెల్లించాల్సిన అప్పును తీర్చడానికే ఈ ఆస్తిని అమ్మినట్టు రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఓ ప్రకటనలో తెలిపింది.