వారు పెట్టరు.. వీరిని పెట్టనివ్వరు..!

ABN , First Publish Date - 2021-09-02T16:56:12+05:30 IST

గత ప్రభుత్వ హయాంలో..

వారు పెట్టరు.. వీరిని పెట్టనివ్వరు..!
అన్న క్యాంటీన్‌ వద్ద భోజనాలు నిలిపివేసేందుకు అడ్డుగా బారికేడ్లు కట్టించిన మున్సిపల్‌ అధికారులు

పాలకొల్లులో దాతల సహకారంతో ఎమ్మెల్యే అన్న క్యాంటీన్‌ నిర్వహణ

క్యాంటీన్‌ వద్దకు ఎవరూ రాకుండా బారికేడ్ల ఏర్పాటు


పాలకొల్లు అర్బన్‌: గత ప్రభుత్వ హయాంలో నిర్వహించిన అన్న క్యాంటీన్లను వైసీపీ అధికా రంలోకి రాగానే రద్దు చేసింది. వీటిని తిరిగి పునరుద్ధరించాలని డిమాండ్‌ చేస్తూ.. పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఉద్యమించారు. ప్రభుత్వం ఈ పథకాన్ని తిరిగి ప్రారంభించే వరకు తాను దాతల సహకారంతో పేదలకు ఉచితంగా భోజనం పెడతానని 2019 జూలై 30 నుంచి మూసి వేసిన క్యాంటీన్‌ను పునరుద్ధరించారు. మధ్యలో కొవిడ్‌ వల్ల అవాంతరాలు ఏర్పడినప్పటికీ ఇటీవల మళ్లీ మొదలుపెట్టడంతో బుధవారానికి 257వ రోజుకు చేరింది. అయితే క్యాంటీన్‌కు అడ్డంగా మున్సిపల్‌ కమిషనర్‌ బారికేడ్లు ఏర్పాటు చేయడం వివాదాస్పదమవుతోంది. అన్నదాన కార్య క్రమం నిర్వహించకుండా అడ్డుకునేందుకు వీటిని ఏర్పాటు చేసినట్టు ఎమ్మెల్యే తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు.


బుధవారం ఆయన మాట్లాడుతూ అరగంట పాటు జరిగే అన్నదాన కార్యక్రమానికి అడ్డుగోలుగా బారికేడ్‌లు, దురుద్దేశంతో క్లాత్‌లు కట్టి అడ్డుకోవాలని చూస్తున్నారని ఆరోపిం చారు. దీనిపై మంగళవారం రాత్రి మున్సిపల్‌ కమిషనర్‌కు చెబితే వాటిని తీయిస్తానని చెప్పారని, బుధవారం మధ్యా హ్నం వరకూ మనుషులు దొరకలేదని సమాధానం చెప్పడం అన్యాయమని అన్నారు. ప్రభుత్వం పెట్టదు.. పెట్టేవారిని పెట్టనివ్వకపోవడాన్ని ఏమనాలో కూడా అర్థం కావడం లేదని విమర్శించారు. పేదల కడుపు నింపే అన్న క్యాంటీన్‌ అడ్డుకోవాలని ప్రయత్నిస్తే పట్టణంలో మరో పది క్యాంటీన్లు పెట్టిస్తానని డాక్టర్‌ నిమ్మల హెచ్చరించారు.


Updated Date - 2021-09-02T16:56:12+05:30 IST