అన్నాడీఎంకే, బీజేపీ పొత్తు పదిలం!
ABN , First Publish Date - 2020-11-22T09:40:42+05:30 IST
వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే, బీజేపీ మధ్య పొత్తు కొనసాగుతుందని ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి ఒ.పన్నీర్సెల్వం
ఈపీఎస్, ఓపీఎస్ ప్రకటన.. ధ్రువీకరించిన అమిత్ షా
చెన్నై, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే, బీజేపీ మధ్య పొత్తు కొనసాగుతుందని ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి ఒ.పన్నీర్సెల్వం ప్రకటించారు. చెన్నై ప్రజల దాహార్తిని తీర్చేందుకు కొత్తగా నిర్మించిన తేర్వాయ్కండ్రిగ జలాశయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్షా జాతికి అంకితం చేశారు. చెన్నై మెట్రో రైలు రెండో దశ విస్తరణ పనులు, తదితర పథకాలకూ శంకుస్థాపన చేశారు. ఈ సభలో ఎడప్పాడి, పన్నీర్సెల్వం మాట్లాడుతూ.. బీజేపీతో పొత్తు కొనసాగుతుందన్నారు. ఈ సభలో ప్రసంగించిన అమిత్షా కూడా అన్నాడీఎంకే ప్రభుత్వానికి.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అండగా నిలుస్తుందని, రెండు పార్టీల మధ్య పొత్తు అసెంబ్లీ ఎన్నికల్లోనూ కొనసాగుతుందని ధ్రువీకరించారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం శనివారం మధ్యాహ్నం చెన్నైకు కేంద్ర హోంమంత్రి అమిత్షా చేరుకున్నారు. మీనంబాక్కం రహదారి పొడవునూ బీజేపీ కార్యకర్తలు పార్టీ జెండాలతో స్వాగతం పలికారు. దీంతో అమిత్ షా కారు ఆపి రోడ్డుపై నడుస్తూ, చేతులూపుతూ కార్యకర్తలను ఉత్సాహపరిచారు.