కొత్త ఆర్జేసీకి ఝలక్..!
ABN , First Publish Date - 2021-04-09T07:26:13+05:30 IST
జిల్లా దేవదాయశాఖలో ఊహించని ఘటనలతో..
జిల్లాలో పోస్టింగ్ ఇచ్చిన 24 గంటల్లో సురేష్బాబు తిరిగి వెనక్కి
సెక్రటేరియట్లో రిపోర్టు చేయాలని ఉత్తర్వులు
అన్నవరం ఈవోకు ఆర్జేసీగా అదనపు బాధ్యతలు
భానుగుడి(కాకినాడ): జిల్లా దేవదాయశాఖలో ఊహించని ఘటనలతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఇంతవరకు ఆర్జేసీగా ఉన్న డి భ్రమరాంబను బుధవారం విజయవాడ దుర్గ గుడికి బదిలీ చేశారు. అక్కడ పనిచేస్తున్న సురేష్బాబుకు పదోన్నతి కల్పిస్తూ ఇక్కడకు ఆర్జేసీగా నియమించారు. అయితే ఆయనకు పోస్టింగ్ ఇచ్చిన 24 గంటల్లో తిరిగి వెనక్కి రప్పించడం చర్చనీయాంశమైంది.
విజయవాడ దుర్గ గుడిలో ఆయన ఈవోగా ఉన్న హయాంలో ఏసీబీ దాడులు జరిగిన విషయం తెలిసిందే. ఈవోగా పనిచేసిన ఆయనను ఆర్జేసీగా నియమించడం వల్ల ఆ శాఖలోని కొందరు ఉన్నతాధికారులు అభ్యంతరం తెలిపినట్టు సమాచారం. ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల పరిధిలో ఆర్జేసీగా పనిచేయాలంటే కష్టతరం. మూడు జిల్లాలకు కలిపి గ్రేడ్ -1 ఆలయాలు, సత్రాలు, ప్రముఖ ఆలయాల నిర్వహణ మొత్తం ఆర్జేసీ అజమాయిషీలో ఉంటుంది. ఒక ఈవో స్థాయి అధికారి ఆర్జేసీగా నియమితులు కావడం వల్ల పర్యవేక్షణ గాడితప్పుతుందని ఆ శాఖ ఉన్నతాధికారులకు సంకేతాలు వెళ్లాయి. దీంతో సురేష్బాబును కమిషనరేట్ ఉత్తర్వులిచ్చిన 24 గంటల్లోనే సెక్రటేరియట్లో రిపోర్టు చేయాలని పెద్ద షాక్ ఇచ్చింది. కాగా అన్నవరం ఈవోకు ఆర్జేసీగా అదనపు బాధ్యతలు అప్పగించారు.