నేడు మరో 25 బస్తీ దవాఖానాల ప్రారంభం
ABN , First Publish Date - 2020-08-14T10:01:27+05:30 IST
నగరంలో డివిజన్కు రెండు చొప్పున 300 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం.
హైదరాబాద్ సిటీ, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): నగరంలో డివిజన్కు రెండు చొప్పున 300 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇప్పటికే 170 దవాఖానాలు ఉండగా మరో 25 శుక్రవారం నుంచి అందుబాటులోకి రానున్నాయి. వీటి ప్రారంభోత్సవాల్లో మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతోపాటు కార్పొరేటర్లు పాల్గొంటారు.
జవహర్నగర్, రామంతాపూర్ రాంరెడ్డినగర్ కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాలను స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలతో కలిసి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. భోలక్పూర్, బన్సీలాల్పేటలోని బాపూజీనగర్లో బస్తీ దవాఖానాలను వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, ఖైరతాబాద్లోని జవహర్నగర్ కమ్యూనిటీహాల్లోని బస్తీ దవాఖానాను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి ప్రారంభిస్తారు.
వాస్తవంగా 26 బస్తీ దవాఖానాలు ప్రారంభించాలని భావించగా.. జియాగూడలోని రెండు పడకల ఇళ్ల వద్ద సిద్ధమైన బస్తీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా పడింది. రెండు పడకల ఇళ్లు ప్రారంభించిన తరువాత ఇక్కడ దవాఖానా అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు.