జిల్లాకు మరో 45,000 డోసుల కొవిడ్ వ్యాక్సిన్
ABN , First Publish Date - 2021-01-21T06:09:58+05:30 IST
జిల్లాకు మరో 45 వేల డోసుల కొవిడ్ వ్యాక్సిన్ వచ్చింది. మొదటి దశ కోసం కొద్దిరోజుల కిందట 46,500 డోసుల వ్యాక్సిన్ అందించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు...తాజాగా మరో 45 వేలు డోసుల వ్యాక్సిన్ను పంపించాయి.
విశాఖపట్నం, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): జిల్లాకు మరో 45 వేల డోసుల కొవిడ్ వ్యాక్సిన్ వచ్చింది. మొదటి దశ కోసం కొద్దిరోజుల కిందట 46,500 డోసుల వ్యాక్సిన్ అందించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు...తాజాగా మరో 45 వేలు డోసుల వ్యాక్సిన్ను పంపించాయి. మొదటి దశలో సుమారు 38 వేల మంది ఆరోగ్య సిబ్బందికి వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించారు. వీరందరికీ 28 రోజుల తరువాత రెండో డోసు ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకోసం సుమా రు 76 వేల డోసుల వ్యాక్సిన్ అవసరమవుతుంది. అందుకు అనుగుణంగానే వ్యాక్సి న్ను ప్రభుత్వం పంపించింది. ఆరోగ్య సిబ్బంది తరు వాత పోలీసుల తోపాటు ఇతర శాఖలకు చెందిన సిబ్బందికి వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. తాజాగా వచ్చిన వ్యాక్సిన్లో కొంత వారి కోసం కేటాయించే అవకాశముంది.
ఐదో రోజు 1,804 మందికి వ్యాక్సిన్
ఇదిలావుండగా బుధవారం జిల్లాలో 3,150 మందికి స్లాట్ ఇచ్చినప్పటికీ...1,804 మంది మాత్రమే వ్యాక్సిన్ (57.26 శాతం) తీసుకునేందుకు వచ్చారు. మిగిలిన వారిలో కొంతమంది భయంతో, మరికొంత మంది అనారోగ్య సమస్యలతో వ్యాక్సినేషన్కు దూరంగా ఉన్నారు. మొత్తం ఐదు రోజుల్లో 14,382 మందికి స్లాట్ ఇవ్వగా, 7,801 మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. మరో 6,581 మంది వ్యాక్సినేషన్కు దూరంగా ఉన్నారు. కాగా, గత నాలుగు రోజులుగా 32 కేంద్రాల్లో వ్యాక్సినేషన్ జరుగుతుండగా, బుధవా రం నుంచి మరో 11 కేంద్రాలను పెంచారు.