మరో 97మందికి పాజిటివ్
ABN , First Publish Date - 2020-08-04T10:10:17+05:30 IST
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. సోమవారం ఒక్కరోజులోనే రికార్డు స్థాయిలో 97 కేసులు నమోదయ్యాయి.
ఖమ్మం జిల్లాలో 71, భద్రాద్రిలో 26మందికి లక్షణాలు
భద్రాచలం మాజీ ఎమ్మెల్యే రాజయ్యకూ నిర్ధారణ
కరకగూడెంలో ఒకరు మృతి
(ఖమ్మం/భద్రాద్రికొత్తగూడెం నెట్వర్క్)
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. సోమవారం ఒక్కరోజులోనే రికార్డు స్థాయిలో 97 కేసులు నమోదయ్యాయి. ఖమ్మం జిల్లాలో మొత్తం 241మందికి ర్యాపిడ్ కిట్స్ పరీక్షలు నిర్వహించగా 71మందికి పాజిటివ్ వచ్చినట్టు జిల్లా వైద్యాధికారి డాక్టర్ మాలతి ప్రకటించారు. వీరిలో 82మంది జిల్లా ఆసుపత్రిలో, మరో 24మంది మద్దులపల్లి కొవిడ్ కేర్ సెంటర్లో వైద్యసేవలు పొందుతున్నట్టు తెలిపారు. భద్రాద్రి జిల్లాలో 26మందికి పాజిటివ్ నిర్ధారణవగా.. కరకగూడెం మండల కేంద్రంలో ఒకరు మృతిచెందారు. ఖమ్మం జిల్లా మధిర మండలంలో ఆరుగురికి, వైరా పట్టణంలో ముగ్గురు, మండలంలోని ఖానాపురంలో ఒకరికి, కొణిజర్లలో ఇద్దరికి, మండలంలోని పల్లిపాడులో భార్యభర్తలకు, ఎర్రుపాలెం మండలం జమలాపురంలో ఒకరికి, సత్తుపల్లి పట్టణంలోని నేతాజీరోడ్లో ఓ మహిళకు, కల్లూరు మండలం చెన్నూరులో నలుగురికి, యర్రబోయినపల్లిలో ఒకరికి, నేలకొండపల్లిలోని ఓ మెడికల్ షాపు యజమాని, ఓ సహకార సంఘం అధ్యక్షుడికి కరోనా నిర్ధారణైంది. వీరు కాకుండా మరో 48మందికి పాజిటివ్ వచ్చినట్టు జిల్లా వైద్యశాఖ నివేదికలో వెల్లడించారు.
ఇల్లెందు పట్టణంలో ఆరుగురికి, టేకులపల్లి మండలం ముత్యాలంపాడులో ఓ మెడికల్షాపు యాజమానికి, ములకలపల్లి మండలం కొమ్ముగూడెంలో ఒకరికి, జూలూరుపాడు పోలీస్స్టేషన్లో హోమ్గార్డు(డ్రైవర్), ఓ మహిళా కానిస్టేబుల్కు, పడమటనర్సాపురం గ్రామానికి చెందిన ఓ ఆటోడ్రైవర్కు, చర్లలో ఒకరికి, దుమ్ముగూడేనికి చెందిన ఓ మహిళా ఉద్యోగికి, అశ్వారావుపేటలో ఓ జ్యూయలరీస్ దుకాణంలో పనిచేసే మహిళ భర్తకు, దమ్మపేట మండలంలో ఓ ప్రభుత్వ వైద్యురాలికి, మందలపల్లిలోని ఎస్సీ కాలనీలో ఓ యువకుడికి, భద్రాచలంలో వైద్యశాల సిబ్బంది ఒకరికి, బ్యాంకు ఉద్యోగి, ప్రైవేట్ వైద్యశాలలో పనిచేసే ఓ వ్యక్తికి పాజిటివ్ వచ్చింది. ఇదిలా ఉంటే భద్రాచలం మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్యకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా ఆయనక పాజిటివ్ నిర్ధారణైంది. ఇక కరకగూడేనికి చెందిన ఓ వ్యక్తి కరోనా లక్షణాలతో భద్రాచలం ఏరియా వైద్యశాలలో చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడు. అయితే భద్రాద్రికొత్తగూడెం జిల్లాకు సంబంధించి వైద్యశాఖ అధికారులు ఎలాంటి బులిటెన్ను వెల్లడించకపోవడంతో కరోనా కేసులు, మృతుల లెక్కలు, వివరాల్లో గందరగోళం నెలకొంది.