రైతు భరోసా కేంద్రాలతో మరో హరిత విప్లవం
ABN , First Publish Date - 2020-05-31T11:27:38+05:30 IST
రైతు భరోసా కేంద్రాలతో రాష్ట్రంలో మరో హరిత విప్లవానికి నాంది పలికినట్లయిందని ఉప ముఖ్యమంత్రి ఎస్బీ
డిప్యూటీ సీఎం అంజద్బాషా
వల్లూరులో ప్రారంభించిన మంత్రి, అధికారులు
వల్లూరు, మే 30: రైతు భరోసా కేంద్రాలతో రాష్ట్రంలో మరో హరిత విప్లవానికి నాంది పలికినట్లయిందని ఉప ముఖ్యమంత్రి ఎస్బీ అంజద్బాషా అన్నారు. శనివారం వల్లూరులో ఆయన కలెక్టర్ హరికిరణ్, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాధరెడ్డి, జాయింట్ కలెక్టరు గౌతమి కలసి రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం అంజద్బాషా మాట్లాడుతూ రైతుల కళ్లల్లో ఆనందాన్ని చూసేందుకు వారికి తగిన సలహాలు, సూచనలు అందించేందుకు, సబ్సిడీ విత్తనాలు ఇచ్చేందుకోసమే ప్రతి గ్రామ పంచాయతీలో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. అంతకు ముందు సీఎం జగన్ నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్లో వల్లూరు ఆర్బీకే నుంచి మంత్రి, అధికారులు పాల్గొన్నారు. కలెక్టరు హరికిరణ్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 620 రైతుభరోసా కేంద్రాలను ప్రారంభించామని, అందులో భాగంగా వల్లూరులో ప్రారంభించినట్లు వీడియో కాన్పరెన్స్లో తెలిపారు.
కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాధరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి రైతుల కళ్లల్లో ఆనందం చూసేందుకోసమే ఈ ఆర్బీకేలను ప్రారంభించినట్లు తెలిపారు. అనంతరం వల్లూరు మండలం నుంచి ఇందిరెడ్డి శంకర్రెడ్డి అనే రైతుతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడించారు. ఈ సందర్భంగా శంకర్రెడ్డి మాట్లాడుతూ రైతుల కోసం ప్రత్యేకంగా అగ్రికల్చర్ అసిస్టెంట్లను నియమించినందుకు ధన్యవాదాలు తెలిపారు. వ్యవసాయశాఖ అధికారులు మాట్లాడుతూ నాణ్యమైన ఎరువులు, పురుగు మందులు, విత్తనాలను రైతు ఇంటికే తీసుకవచ్చేందుకు ఈ కేంద్రాలు ఉపయోగపడతాయన్నారు. అంతకు మునుపు కలెక్టరు, ప్రజాప్రతినిధులతో కలిసి ఉద్యానవన, ప్రకృతి వ్యవసాయం తదితర స్టాల్స్ను పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో శిక్షణ కలెక్టరు వికాస్ మర్మాట్, వ్యవసాయశాఖ జేడీ మురళీక్రిష్ణ, ఉద్యానశాఖ డీడీ మధుసూధన్రెడ్డి, పశుసంవర్ధకశాఖ జేడీ సత్యప్రకాశ్, పట్టు పరిశ్రమ శాఖ ఏడీ రాజశేఖర్రెడ్డి, ప్రకృతి వ్యవసాయ డీపీయం నాగరాజు, ఆత్మ పీడీ చంద్రనాయక్, తహశీల్దారు వెంకటేశ్వర్రావు, ఎంపీడీవో జుబేదా తదితరులు పాల్గొన్నారు. డీఎస్పీ సూర్యనారాయణ ఆధ్వర్యంలో రూరల్ సీఐ వినయకుమార్రెడ్డి, కమలాపురం సీఐ ఉలసయ్య, ఎస్ఐలు రాజగోపాల్, రాజారెడ్డి, మల్లిఖార్జునరెడ్డి, కొండారెడ్డి బందోబస్తు నిర్వహించారు.