మరోసారి.. గ్యాస్ భారం!
ABN , First Publish Date - 2021-09-03T05:15:41+05:30 IST
వంట గ్యాస్ వినియోగదారులకు మరోసారి ధరల షాక్ తగిలింది. 15 రోజుల వ్యవధిలో సిలిండర్ ధరలు మళ్లీ పెరిగాయి. ఆయిల్ కంపెనీలు డొమెస్టిక్ సిలిండర్(14.2 కేజీలు)పై రూ.25, కమర్షియల్ సిలిండర్(19 కేజీలు)పై రూ.75 చొప్పున పెంచాయి. ఇప్పటికే పెట్రోల్, డీజిల్తో పాటు నిత్యావసర వస్తువుల ధరల భారంతో సామాన్య, మధ్య తరగతి కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాయి. తాజాగా గ్యాస్ ధర కూడా ఎప్పటికప్పుడు పెరిగిపోతుండడంతో ఆందోళన చెందుతున్నాయి.
- 15 రోజుల వ్యవధిలో సిలిండర్ ధర మరోసారి పెంపు
(నందిగాం/మెళియాపుట్టి)
వంట గ్యాస్ వినియోగదారులకు మరోసారి ధరల షాక్ తగిలింది. 15 రోజుల వ్యవధిలో సిలిండర్ ధరలు మళ్లీ పెరిగాయి. ఆయిల్ కంపెనీలు డొమెస్టిక్ సిలిండర్(14.2 కేజీలు)పై రూ.25, కమర్షియల్ సిలిండర్(19 కేజీలు)పై రూ.75 చొప్పున పెంచాయి. ఇప్పటికే పెట్రోల్, డీజిల్తో పాటు నిత్యావసర వస్తువుల ధరల భారంతో సామాన్య, మధ్య తరగతి కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాయి. తాజాగా గ్యాస్ ధర కూడా ఎప్పటికప్పుడు పెరిగిపోతుండడంతో ఆందోళన చెందుతున్నాయి. జిల్లాలో ఇండియన్, భారత్, హెచ్పీసీఎల్ తదితర కంపెనీలకు చెందిన 4.50 లక్షల వంట గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. వీటితో పాటు హోటళ్లు, ఇతర వాణిజ్య అవసరాలకు సంబంధించి సుమారు 2.50 లక్షలకుపైగా గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో గృహవసర వినియోగ సిలిండర్ రూ.613 ఉండగా... ఆగస్టు 1 నాటికి రూ.861.50కి చేరింది. అదే నెల 16 నాటికి రూ.25 పెరగడంతో సిలిండర్ ధర రూ.886.50కి చేరింది. తాజాగా మరో రూ.25 పెంచడంతో ప్రస్తుతం రూ.911.51కు చేరుకుంది. దీనికితోడు అదనంగా రవాణా చార్జీలు కూడా వసూలు చేస్తుండడంతో సిలిండర్ ధర రూ.వెయ్యికి చేరువలో ఉంది. వాణిజ్య సిలిండర్ ధర గత నెలాఖరు వరకు 1,649.50 ఉండగా, తాజాగా రూ.75 పెంచడంతో రూ.1,724.50కి చేరింది. దీనికి రవాణా చార్జీలు అదనంగా వసూలు చేయనున్నారు. తాజా ధరల పెంపుతో జిల్లా వినియోగదారులపై ప్రతి నెలా సుమారు రూ.12 లక్షల మేర అదనపు భారం పడనుంది. అంతర్జాతీయ మార్కెట్ ధరల ప్రభావం అంటూ వంట గ్యాస్ ధరలను ప్రభుత్వం ప్రతి నెలా సవరిస్తోంది. గతంలో మూడు లేదా ఆరు నెలలుకోసారి ధరలు పెంచేది. ప్రస్తుతం 15 రోజులకోసారి ధరలు పెంచడంతో వినియోగదారులపై అదనపు భారం పడుతోంది. సబ్సిడీ విషయంలో పాతవే కొనసాగించి.. ధరలు మాత్రం ఎప్పటికప్పుడు పెంచుతూపోవడంతో మధ్య తరగతి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ధరల నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.