పాతబస్తీలో మరో దారుణ హత్య.. అసలేం జరిగింది..!?
ABN , First Publish Date - 2021-06-13T17:45:04+05:30 IST
నిర్మాణంలో ఉన్న భవనంలో రక్తపు మడుగులో యువకుడి శవం ఉంది....
- నిర్మాణంలో ఉన్న భవనంలో
- రక్తపు మడుగులో యువకుడి శవం
హైదరాబాద్ సిటీ/మదీన : నిర్మాణంలో ఉన్న భవనంలో రక్తపు మడుగులో యువకుడి శవం ఉంది. అతడిని హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. హుసేనీఆలం ఇన్స్పెక్టర్ జి.నరేశ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం... బహదూర్పురా కిషన్బాగ్కు చెందిన సయ్యద్ అన్వర్ కుమారుడు సయ్యద్ జుబేర్ అలీ (23) సోదరుడితో కలిసి పండ్ల వ్యాపారం చేస్తుంటాడు. ఇతను గతంలో ఖిల్వత్లో నివసించేవాడు. శుక్రవారం రాత్రి ఖిల్వత్లో ఉండే సాలం, తారిఖ్, ముజఫర్, జాఫర్ అనే స్నేహితులను కలవడానికని ఇంట్లో చెప్పి బైక్పై బయటకు వెళ్లాడు. శనివారం శాలిబండ చౌరస్తాలోని ఆశా టాకీస్ సమీపంలో నిర్మాణంలో ఉన్న ఓ నాలుగంతస్తుల భవనంలో శవమై పడి కనిపించాడు. మృతదేహం రక్తం మడుగులో ఉంది.
శనివారం ఉదయం పనుల్లోకి వచ్చిన భవన నిర్మాణ కార్మికులు చూసి యజమానికి, పోలీసులకు సమాచారమందించారు. విషయం తెలుసుకున్న చార్మినార్ ఇన్చార్జి ఏసీపీ భిక్షంరెడ్డి, హుసేనీఆలం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అతని గొంతు, మెడ, చేతులపై కత్తితో నరికిన గాయాలున్నాయి. దీంతో జుబేర్ అలీని స్నేహితులే హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. అతనికి గతంలో కొందరితో విభేదాలున్నాయి. స్నేహితుల్లో కొందరు దొంగతనంతో పాటు చిన్న చిన్న కేసుల్లో నిందితులుగా ఉన్నారు. ఆ సమాచారం పోలీసులకు చేరవేస్తున్నాడనే అనుమానంతోనే హత్య చేసి ఉంటారని భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా మా ర్చురీకి తరలించారు. క్లూస్ టీం, డాగ్టీమ్లను రప్పించి పోలీసులు ఆధారాలు సేకరించారు. నిందితులను పట్టుకోవడానికి నాలుగు టీమ్లను ఏర్పాటు చేశామని, త్వరలోనే పట్టుకుంటామని భిక్షంరెడ్డి తెలిపారు. కొందరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.