బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వస్తే ‘యాంటీ రోమియో’ స్క్వాడ్స్: యోగి
ABN , First Publish Date - 2021-04-09T01:38:55+05:30 IST
పశ్చిమ బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వస్తే ‘యాంటీ రోమియో’ బృందాలను ఏర్పాటు చేస్తామని ఉత్తరప్రదేశ్
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వస్తే ‘యాంటీ రోమియో’ బృందాలను ఏర్పాటు చేస్తామని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. టీఎంసీ ప్రభుత్వ హయాంలో బెంగాల్లో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. హుగ్లీ, హౌరా జిల్లాల్లో నిర్వహించిన మూడు ఎన్నికల ర్యాలీల్లో యోగి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న శాసనసభ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే మహిళలు, విద్యపై దృష్టి సారిస్తామన్నారు.
‘‘మహిళలకు బెంగాల్లో ఎందుకు రక్షణ లేకుండా పోయింది? అమ్మాయిలకు విద్య, రవాణాను ఉచితంగా అందిస్తాం. బాలికల పాఠశాలల చుట్టూ చక్కర్లు కొట్టే రోమియోల ఆట కట్టించేందుకు ‘యాంటీ రోమియో’ బృందాలను ఏర్పాటు చేస్తాం’’ అని యోగి హామీ ఇచ్చారు.
ఉత్తరప్రదేశ్లో 2017లోనే యాంటీ రోమియో స్క్వాడ్స్ను ఏర్పాటు చేశారు. కాగా, మహిళల రక్షణ గురించి పదేపదే మాట్లాడుతున్న బీజేపీకి టీఎంసీ ప్రభుత్వం గట్టిగా కౌంటర్ ఇస్తోంది. హథ్రాస్ గ్యాంగ్ రేప్ ఘటనపై బీజేపీ నోరెందుకు మెదపడం లేదని ప్రశ్నిస్తోంది.