ఎదురుచూపులు
ABN , First Publish Date - 2022-09-27T04:47:12+05:30 IST
కేసీఆర్ కిట్ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వ బాలింతలకు ఇస్తున్న నగదు అందడం లేదు. దాంతో పౌష్ఠికాహారం తీసుకోవడంలో వారు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
కేసీఆర్ కిట్ డబ్బుల కోసం బాలింతల పడిగాపులు
గద్వాల, వనపర్తి జిల్లాల్లో వేల మందికి పెండింగ్
పాప పుడితే రూ.13 వేలు.. బాబు పుడితే రూ.12 వేలు
వనపర్తి/గద్వాల, సెప్టెంబరు 26(ఆంధ్రజ్యోతి): కేసీఆర్ కిట్ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వ బాలింతలకు ఇస్తున్న నగదు అందడం లేదు. దాంతో పౌష్ఠికాహారం తీసుకోవడంలో వారు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మాతాశిశు సంరక్షణ, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్యను పెంచడం, తద్వారా ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేయడం దిశగా 2017లో రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ కిట్ పథకాన్ని ప్రవేశ పెట్టింది. ఈ పథకం కింద ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవం చేసుకున్న వారికి 16 రకాల వస్తువులతో కిట్ ఇస్తారు. కాన్పులు చేసుకున్న బాలిం తలకు ఏఎన్ఎసీ చెకప్లు, డెలివరీ, జీరో, ఫుల్ ఇమ్యూనైజేషన్కు ఆడపిల్ల పుడి తే రూ. 13 వేలు, మగపిల్లాడు పుడితే రూ.12 వేలు వారి ఖాతాల్లో జమ చేస్తారు. విడతల వారీగా డబ్బులు జమ కావాలి. అయితే సంవత్సరన్నర కాలంగా కేసీఆర్ కిట్ డబ్బులు ఖాతాల్లో పడటం లేదు. ఏఎన్సీ నుంచి ఫుల్ ఇమ్యూనైజేషన్ వరకూ దశలు పూర్తయినా ఏ విడత నగదు కూడా జమ కావడం లేదు. దీనివల్ల పిల్లల పోషణ, పౌష్ఠికాహారం అందజేయడం వంటి వాటిలో బాలింతలు ఇబ్బందులు పడుతున్నారు. ఆశ వర్కర్లు, ఏఎన్ఎంల చుట్టూ తిరుగితే డబ్బులు ప్రభుత్వం నుంచి నేరుగా ఖాతాల్లో పడతాయని వారు చెబుతున్నారు. కరోనా లాక్డౌన్తో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నా, ప్రభుత్వ ప్రయోజిత కార్యక్రమాలను వేటినీ ఆపడం లేదు. నెలనెలా పింఛన్లు, రైతుబంధు, సీఎంఆర్ఎఫ్ ఇతరత్రా పథ కాలన్నింటికీ సమయానికి డబ్బులు అందుతుండగా కేవలం కేసీఆర్ కిట్ డబ్బులు మాత్రమే ఎందుకు ఇవ్వడం లేదని బాలింతలు ప్రశ్నిస్తున్నారు. అన్ని ప్రాయోజిత కార్యక్రమాల్లాగే కేసీఆర్ కిట్ డబ్బులనూ ప్రభుత్వం త్వరిత గతిన విడుదల చేయాలని కోరుతున్నారు.
ప్రభుత్వాస్పత్రులపై పెరిగిన భరోసా..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి విడతగా ప్రభుత్వం వైద్యరంగం బలోపేతంపై దృష్టిసారించింది. అందులో మరీ ముఖ్యంగా మాతాశిశు సంరక్షణ, ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకాన్ని పెంచే దిశగా అనేక కార్యక్రమాలను చేపట్టింది. ప్రతీ జిల్లాలో ఒక మాతాశిశు సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేయడంతో పాటు, కేసీఆర్ కిట్ పథకాల అమలుతో ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజలకు భరోసా పెరిగింది. గతంలో 30 శాతం ఉన్న ప్రసవాల సంఖ్య దాదాపు 60 శాతానికి చేరింది. నిరంతర పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా గైనాకాలజీ డాక్టర్లను నియమించడం, ఆస్పత్రులపై నిరంతరం సమీక్షలు చేయడంతో ఫలితాలనిచ్చాయి. 2017 నుంచి ఇప్పటి వరకు కేవలం వనపర్తి, గద్వాల జిల్లాల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో లక్షకుపైగా మంది గర్భిణులు వైద్యం చేయిం చుకున్నారంటే ప్రభుత్వ లక్ష్యం ఎంతమేర సక్సెస్ అయ్యిందో అర్థం చేసుకోవచ్చు. అంతకుముందు పై మొత్తంలో కనీసం సగం కూడా ప్రసవాలు జరగలేదు. కరోనా లాక్డౌన్లో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు తగ్గినా, తర్వాత మళ్లీ పుంజుకున్నాయి. ఇప్పటికీ మెజారిటీ బాలింతలు, గర్భిణులు ఏఎన్సీ, జీరో, ఫుల్ ఇమ్యూనైజేషన్ కోసం ప్రభుత్వ ఆస్పత్రులకే వెళ్తున్నారు. ఏఎన్సీ, జీరో, ఫుల్ ఇమ్యూనైజేషన్ మాత్రమే చేసుకుని ప్రభుత్వ ఆస్పత్రుల్లో డెలివరీలు చేసుకోకున్నా సర్జరీ మొత్తం తీసేసి మిగతా మొత్తం ఇస్తుండటం కూడా ఇందుకు కారణంగా చెప్పొచ్చు. కేసీఆర్ కిట్ ద్వారా ఏఎన్సీ చెకప్లకు రూ.3,000, డెలివరీలో ఆడపిల్ల పుడితే రూ.5,000, మగపిల్లాడు పుడితే రూ.4,000, జీరో ఇమ్యూనైజేషన్కు రూ.2,000, ఫుల్ ఇమ్యూనైజేషన్కు రూ.3,000 చొప్పున అందజేస్తారు. డెలివరీ కాకుండా, మిగతా దశలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో చేయించుకుంటే రూ.8,000 ఖాతాల్లో జమ అవుతాయి.
వేల మందికి పెండింగ్
కేసీఆర్ కిట్ పథకం కింద వనపర్తి జిల్లాలో ఇప్పటివరకు 74,226 మందికి రూ.22.27కోట్లు చెల్లించారు. మరో 30,961 మందికి సుమారు రూ.9.03 కోట్లు పెండింగ్లో ఉన్నాయి. ఇందులో ఏఎన్సీ చెకప్ల స్టేజీలో 8,965 మందికి రూ.2.68 కోట్లు పెండింగ్లో ఉండగా, డెలివరీల స్టేజ్లో 6,013 మందికి రూ.2.40 కోట్లు పెండింగ్లో ఉన్నాయి. జీరో ఇమ్యూనైజేషన్ స్టేజ్లో 8,562 మందికి రూ.1.71 కోట్లు, ఫుల్ ఇమ్యూనైజేషన్ స్టేజీలో 7,421 మందికి రూ. 2.22 కోట్లు పెండింగ్లో ఉన్నాయి. చెల్లించిన మొత్తం కంటే చెల్లించాల్సిన మొత్తం తక్కువగా ఉన్నా, డబ్బులు మాత్రం ఖాతాల్లో పడటం లేదు. ఇక గద్వాల జిల్లాలో ఇప్పటివరకు కేసీఆర్ కిట్ కోసం 86,880 మంది అర్హత సాధించారు. వారికి రూ.25.26 కోట్లు అందించారు. ఇంకా 39,986 మందికి రూ.11.87 కోట్లు పెండింగ్లో ఉన్నాయి. ఇందులో ఏఎన్సీ చెక్ అప్లు పూర్తి చేసుకుని 11,739 మంది అర్హత సాధించగా, వారికి రూ.3.52 కోట్లు ఇవ్వాల్సి ఉంది. డెలవరీ దశలో 6,645 మందికి సుమారు రూ.2.99 కోట్లు, జీరో ఇమ్యూనైజేషన్ దశలో 11,197 మందికి రూ.2.23 కోట్లు, ఫుల్ ఇమ్యునైజేషన్ దశలో 10,405 మందికి రూ.3.12 కోట్లు పెండింగ్లో ఉన్నాయి.