కేంద్ర తెచ్చిన సాగు వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలి
ABN , First Publish Date - 2021-01-17T05:24:36+05:30 IST
కేంద్ర తెచ్చిన సాగు వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి అన్నారు.
మిర్యాలగూడ, జనవరి 16 : కేంద్ర తెచ్చిన సాగు వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి అన్నారు. రైతులు, వ్యవసాయ కార్మికులు ఢిల్లీలో చేస్తున్న వీరోచిత పోరాటానికి సంఘీభావంగా పార్టీ నాయకులు సుందర్నగర్లో శనివారం నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొని మాట్లాడారు. కేంద్రం ఆమోదించిన వ్యవసాయ చట్టాలు రైతులను నరకకూపంలోకి నెట్టేలా ఉన్నాయన్నారు. నూతన విద్యుత్ చట్టాలతో వ్యవసాయాన్ని పూర్తిగా కార్పొరేటీకరణకు ప్రభుత్వం యత్నిస్తోందని విమర్శించారు. ఇది గ్రహించిన రైతులు పెద్దఎత్తున ఢిల్లీలో పోరాడుతున్నారన్నారు. ప్రభుత్వం తక్షణమే రైతు ప్రతినిధులతో చర్చించి రైతు వ్యతిరేక చీకటి చట్టాలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతు తెలిపేందుకు వెళ్లనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు డబ్బికార్ మల్లే ష్, వీరేపల్లి వెంకటేశ్వర్లు, మల్లు గౌతంరెడ్డి, వేములపల్లి వైస్ ఎంపీపీ పాదూరి గోవర్దనమ్మ, రాములు, వెంకటయ్య, వజ్రగిరి అంజయ్య, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
రైతులను విస్మరించిన కేంద్రం : సీపీఎం
దామరచర్ల : కేంద్ర ప్రభుత్వం రైతుల సమస్యను విస్మరించిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి అన్నారు. మండల కేంద్రంలో శనివారం నిర్వహించిన పార్టీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఢిల్లీ నడ్డిబోడ్డులో వేలాదిమంది రైతులు చలిలో ఆందోళన చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం వారి సమస్యను పరిష్కరించేందుకు ఆసక్తి చూపట్లేదన్నారు. ప్రజల సమస్యల పరిష్కారంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలం అయ్యాయని విమర్శించారు. సమావేశంలో పార్టీ నాయకులు డి.మల్లేష్, వెంకటేశ్వర్లు, ఎర్రనాయక్, పాపానాయక్, జైరాం, దయానంద్, గోపి పాల్గొన్నారు.