బ్రేకింగ్ : చిరంజీవిని కలిసిన ఏపీ బీజేపీ చీఫ్
ABN , First Publish Date - 2020-08-07T00:05:54+05:30 IST
టాలీవుడ్ ప్రముఖ నటుడు, మాజీ మంత్రి మెగాస్టార్ చిరంజీవిని ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కలిశారు
హైదరాబాద్ : టాలీవుడ్ ప్రముఖ నటుడు, కేంద్ర మాజీ మంత్రి మెగాస్టార్ చిరంజీవిని ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కలిశారు. గురువారం సాయంత్రం హైదరాబాద్లోని చిరు ఇంటికి వెళ్లిన ఆయన చిరుతో భేటీ అయ్యారు. బీజేపీ చీఫ్గా బాధ్యతలు చేపట్టిన సోమును మెగాస్టార్ అభినందించారు. ఈ సందర్భంగా పుష్పమాల, శాలువాతో వీర్రాజును చిరంజీవి సత్కరించారు. అనంతరం పలు విషయాలపై ఇద్దరి మధ్య చర్చలు జరిగాయని తెలుస్తోంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్తో కలిసి ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని సోము వీర్రాజుకు చిరంజీవి సూచించారు.
కాగా.. బీజేపీ చీఫ్గా బాధ్యతలు చేపట్టిన సోముకు ట్విట్టర్ వేదికగా పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఇంతవరకూ వీర్రాజును పవన్ కలవలేదు. పవన్ కూడా ఏపీ బీజేపీ చీఫ్ను నేరుగా కలుసుకోలేదు. అయితే ఇవాళ వీర్రాజు నేరుగా చిరంజీవితో భేటీ కావడంపై సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. చిరుతో భేటీ తర్వాత పవన్ను కూడా ఆయన కలుస్తారా..? లేదా..? అనేది తెలియాల్సి ఉంది.
ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల అనంతరం చిరు బీజేపీలో చేరుతారని, ఆయనకే రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తారని, అంతేకాదు సీఎం అభ్యర్థి కూడా మెగాస్టారే అని పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన విషయం విదితమే. అప్పట్లో ఈ వ్యవహారం హాట్ టాపిక్ అయ్యింది. తాజా భేటీతో మరోసారి తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.