ఇదేం విచిత్రం.. ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కేపై 36 గంటల తర్వాత కేసేంటి..!?

ABN , First Publish Date - 2021-12-13T00:42:44+05:30 IST

ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ కార్యకలాపాల్లో అక్రమాలు జరిగాయంటూ...

ఇదేం విచిత్రం.. ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కేపై 36 గంటల తర్వాత కేసేంటి..!?

హైదరాబాద్ : ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ కార్యకలాపాల్లో అక్రమాలు జరిగాయంటూ... రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి కె.లక్ష్మీనారాయణ నివాసంలో ఏపీ సీఐడీ అధికారులు సోదాలు జరిపిన విషయం తెలిసిందే. ఈ కేసు విషయంలో ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణపై ఏపీ సీఐడీ జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.  లక్ష్మీనారాయణ ఇంట్లో సోదాల సందర్భంలో విధులకు ఆటంకం కలిగించారని సీఐడీ ఆర్కేపై కేసు నమోదు చేయడం గమనార్హం. చిరకాల మిత్రుడు లక్ష్మీనారాయణను పరామర్శించేందుకు ఆర్కే అక్కడికి వెళ్లారు. అయితే రాధాకష్ణను కొద్దిసేపు ఇక్కడే ఉండాలని సీఐడీ అధికారులే కోరారు. అంతేకాదు.. మీరు ఇక్కడే ఉంటే లక్ష్మీనారాయణ కుటుంబ సభ్యులు సహకరిస్తారని కూడా సీఐడీ కోరింది. ఈ క్రమంలో అధికారులకు అన్ని విధాలా సహకరించాలని కూడా రిటైర్డ్‌ ఐఏఎస్‌ కుటుంబీకులకు ఆర్కే సూచించారు. అయితే ఈ లోపే ఏం జరిగిందో ఏమోకానీ ఒక్కసారిగా సీఐడీ అధికారులు ప్లేట్ మార్చేశారు.


ఇదేం విచిత్రమో..!?

విచారణకు ఆటంకం కలిగించారంటూ 36 గంటల తర్వాత ఏబీఎన్ ఎండీపై కేసు నమోదు చేశారు. విచారణకు అడ్డుకుని ఉంటే అదే సమయంలో.. లేదా అదే రోజు సాయంత్రం వరకో.. అదీ కాకుంటో ఆ మరుసటి రోజో ఎందుకు ఫిర్యాదు చేయలేదో..!. ఈ ప్రశ్నకు సీఐడీనే సమాధానం చెప్పాలి మరి. ఇవన్నీ అటుంచితే.. సాక్ష్యాధారాలతో సహా వీడియో ఫుటేజ్‌ను ఏబీఎన్-ఆంధ్రజ్యోతి బయటపెట్టింది. ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో ఇలా సీఐడీ.. జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిందనేది క్లారిటీగా అర్థమవుతోంది. విచారణ సమయంలో ఆర్కేని అక్కడే ఉండాలని కోరడమేంటి..? 36 గంటల తర్వాత మళ్లీ ఇలా కేసు నమోదు చేయడమేంటి..? ఇదేం విచిత్రమో అంటూ తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖులు, నిపుణులు, విశ్లేషకులు తీవ్రంగా మండిపడుతున్నారు. నిజంగా ఆర్కే విచారణను అడ్డుకుని ఉంటే అప్పుడే హైదరాబాద్‌లో ఎందుకు ఫిర్యాదు చేయలేదు..? ఇది కచ్చితంగా ఆర్కేపై కక్షసాధింపు చర్యేనని రాజకీయ ప్రముఖులు సైతం సీఐడీ తీరును తప్పుబడుతున్నారు.

Updated Date - 2021-12-13T00:42:44+05:30 IST