కొత్త అప్పు కోసం ఏపీ ప్రభుత్వం గెజిట్ విడుదల
ABN , First Publish Date - 2021-12-08T19:19:08+05:30 IST
ఏపీ ప్రభుత్వం మరో భారీ అప్పుకు టెండర్ వేసింది. కార్పొరేషన్లను అడ్డుపెట్టుకుని...
అమరావతి: ఏపీ ప్రభుత్వం మరో భారీ అప్పుకు టెండర్ వేసింది. కార్పొరేషన్లను అడ్డుపెట్టుకుని... ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేసిన సర్కార్ తాజాగా సివిల్ సప్లయ్ కార్పొరేషన్కు గ్యారంటీ ఇవ్వడంతో మరో రూ.5 వేల కోట్ల రుణ సేకరణకు గెజిట్ విడుదల చేసింది. అయితే సివిల్ సప్లయ్ కార్పొరేషన్కు ఉన్న అప్పు తీసుకునే పరిధి రూ. 32 వేల కోట్లు పూర్తి కాగా దానిపై అదనంగా అప్పు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
నిత్యం ఏదో ఒక చోట అప్పు తీసుకువచ్చి జగన్ సర్కార్ బండి లాక్కొస్తోంది. 10 జాతీయ బ్యాంకుల నుంచి రూ.57,479 కోట్లు అప్పును ఏపీ ప్రభుత్వం చేసింది. ఏపీలో 40 ప్రభుత్వ కార్పొరేషన్లు, కంపెనీలకు జాతీయ బ్యాంకులు నేరుగా రుణాలను మంజూరు చేశాయి. అసలు, వడ్డీ చెల్లింపు బాధ్యత కార్పొరేషన్లు, కంపెనీలదేనని కేంద్రం స్పష్టం చేసింది. రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల ప్రశ్నకు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి భగవత్ కరాడ్ ఈ వివరాలను వెల్లడించారు.2019 నుంచి 2021 నవంబర్ వరకు రుణాలను బ్యాంకులు మంజూరీ చేశాయి. అత్యధికంగా ఎస్బీఐ నుంచి రూ.11,937 కోట్లు రుణాన్ని 9 సంస్థలు పొందాయి. బీవోబీ నుంచి ఐదు కంపెనీలు, కార్పొరేషన్లకు రూ.10,865 కోట్ల అప్పు తీసుకున్నాయి.