ప్రత్యేక హోదాపై సీఎం జగన్ తాజా వ్యాఖ్యలివీ..

ABN , First Publish Date - 2020-05-28T18:29:44+05:30 IST

ఏపీకి ప్రత్యేక హోదాపై సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా స్పందించారు.

ప్రత్యేక హోదాపై సీఎం జగన్ తాజా వ్యాఖ్యలివీ..

అమరావతి : ఏపీకి ప్రత్యేక హోదాపై సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా స్పందించారు. నాలుగోరోజు వైసీపీ మేధోమదనం సదస్సులో భాగంగా ‘మన పాలన-మీ సూచన’ పేరుతో సీఎం ఆధ్వర్యంలో కార్యక్రమం జరుగుతోంది. ఈ సందర్భంగా ప్రత్యేక హోదా ప్రస్తావన వచ్చింది. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని కేంద్రం ఇవ్వలేదని.. హోదా వస్తే ఏపీకి ఎన్నో కంపెనీలు వచ్చేవన్నారు. టీడీపీ ప్రభుత్వం ప్రత్యేక హోదాను తీసుకురాలేకపోయిందన్నారు. పూర్తి మెజార్టీతో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిందని మెజార్టీ రాకపోయింటే ప్రత్యేక హోదా డిమాండ్‌ చేసేవాళ్లమన్నారు. ప్రస్తుతం ప్రత్యేక హోదాకు దూరంగా ఉండే పరిస్థితి నెలకొందన్నారు. భవిష్యత్‌లో ఇతర పార్టీలపై కేంద్రంలో ఆధారపడే పరిస్థితి వస్తుందని.. అప్పుడు ప్రత్యేక హోదా డిమాండ్‌ నెరవేర్చాలని డిమాండ్ చేస్తామని ఈ సందర్భంగా జగన్‌ ధీమా వ్యక్తం చేశారు.


అబద్ధాలు చెప్పడం నాకు రాదు..

గడిచిన ఐదేళ్లలో టీడీపీ ప్రభుత్వం ఎన్నో అబద్దాలు చెప్పింది. ఎన్నో కంపెనీలు, సంస్థలు ఏపీకి వస్తున్నాయని అవాస్తవాలు చెప్పారు. గ్రాఫిక్స్‌ చూపించి ప్రజలను మోసం చేశారు. ఈజ్‌ ఆఫ్ డూయింగ్‌ బిజినెస్‌లో తొలి ర్యాంక్‌ అంటూ గొప్పగా చెప్పుకున్నారు. గత ప్రభుత్వం కంపెనీలకు రూ.4వేల కోట్ల ప్రోత్సాహాకాలు పెండింగ్‌లో పెట్టింది. కంపెనీలకు ప్రోత్సాహక నిధులు పెండింగ్‌లో పెట్టి ఈజ్‌ ఆఫ్ డూయింగ్‌ బిజినెస్‌లో అగ్రస్థానమని ఎలా చెప్పుకున్నారు. విద్యుత్‌ డిస్కంలకు రూ.20 వేల కోట్లు బకాయిలు పెట్టారు. ప్రతి ఏడాది దావోస్‌కు వెళ్తారు.. చెప్పిందే చెప్పి డబ్బాలు కొట్టుకుంటారు. గత ప్రభుత్వం మాదిరిగా అబద్దాలు చెప్పడం నాకు రాదు. నిబద్ధత, నిజాయితీగా ఉంటామని పారిశ్రామికవేత్తలకు చెబుతాంఅని జగన్ స్పష్టం చేశారు.

Updated Date - 2020-05-28T18:29:44+05:30 IST