ఏ రాష్ట్రంలో లేనట్టుగా ఏపీలో సుస్థిర ప్రభుత్వం : జగన్‌

ABN , First Publish Date - 2020-05-28T18:48:17+05:30 IST

భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనట్టుగా ఏపీలో సుస్థిర ప్రభుత్వం ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు.

ఏ రాష్ట్రంలో లేనట్టుగా ఏపీలో సుస్థిర ప్రభుత్వం : జగన్‌

అమరావతి : భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనట్టుగా ఏపీలో సుస్థిర ప్రభుత్వం ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. అత్యధిక స్థానాలు గెలుచుకొని సుస్థిరమైన ప్రభుత్వం ఏపీలో ఉందన్నారు. ఇవాళ ‘మన పాలన-మీ సూచన’ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో లంచాలు ఇస్తేనే పారిశ్రామిక ప్రోత్సాహాకాలు వచ్చే పరిస్థితి ఉండేదని.. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. ఈ వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చేందుకు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చామన్నారు. ఏపీలో అత్యుత్తమ పోలీస్‌ వ్యవస్థ ఉందని జగన్ చెప్పుకొచ్చారు.


75శాతం రిజర్వేషన్లు..

కంపెనీల ఏర్పాటుకు భూములు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. ప్రాథమిక స్థాయి నుంచి ఇంగ్లీష్ మీడియం అమలు ద్వారా వచ్చే పదేళ్లలో సేవారంగంలో అద్భుతమైన మానవ వనరులు అందిస్తాం. ఉద్యోగాల్లో స్థానికులకు 75శాతం రిజర్వేషన్లు తీసుకొచ్చాం. స్థానికులకు 75శాతం రిజర్వేషన్లతో కంపెనీల ఏర్పాటుకు వ్యతిరేకత ఉండదు. విద్యావ్యవస్థలో ఉద్యోగాలు కల్పించే విధానాలు తీసుకొస్తున్నాం అని సీఎం జగన్ తెలిపారు.


మరో 1,466 కంపెనీల ఏర్పాటుకు..

‘ఏ రాష్ట్రానికి లేని వనరులు మనకు ఉన్నాయి. సముద్రతీరం, పోర్టులు, ఎయిర్‌పోర్టులు, రైలు మార్గాలు ఉన్నాయి. రాష్ట్రం నుంచి కియా వెళ్లిపోతుందని విపక్షాలు తప్పుడు ప్రచారం చేశాయి. కంపెనీ ఎక్కడికి వెళ్లడం లేదని కియా ప్రతినిధులు ప్రకటన చేశారు. ఏడాదిలో 32 భారీ, మధ్య తరహా పరిశ్రమలు ఉత్పత్తి ప్రారంభించాయి. 13వేలకు పైగా ఎంఎస్‌ఎం కంపెనీల ఏర్పాటు. ఏడాదిలో మొత్తం 35వేలకు పైగా ఉద్యోగాలు కల్పించాం. మరో 1,466 కంపెనీల ఏర్పాటుకు 600 ఎకరాలు కేటాయించాం. ఏపీలో కంపెనీల ఏర్పాటుకు 20 ప్రముఖ సంస్థల ఆసక్తిగా ఉన్నాయి’ అని సీఎం వైఎస్ చెప్పుకొచ్చారు.

Updated Date - 2020-05-28T18:48:17+05:30 IST