కరోనా పరీక్షల ఆలస్యంపై స్పందించిన ఏపీ ప్రభుత్వం

ABN , First Publish Date - 2020-07-14T23:50:38+05:30 IST

కరోనా పరీక్షల ఫలితాలు ఆలస్యం అవుతున్న ఘటనలపై ప్రభుత్వం స్పందించింది. రాష్ట్రంలోని అన్ని వీఆర్డీఎల్ ల్యాబ్‌లు ట్రూనాట్ ల్యాబ్‌లలో నమునా..

కరోనా పరీక్షల ఆలస్యంపై స్పందించిన ఏపీ ప్రభుత్వం

అమరావతి: కరోనా పరీక్షల ఫలితాలు ఆలస్యం అవుతున్న ఘటనలపై ప్రభుత్వం స్పందించింది. రాష్ట్రంలోని అన్ని వీఆర్డీఎల్ ల్యాబ్‌లు ట్రూనాట్ ల్యాబ్‌లలో నమునా సేకరణ కౌంటర్లను ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నమూనా సేకరణ కౌంటర్లూ మూడు షిఫ్టులూ పనిచేసేలా చూడాలని జిల్లా జేసీలను ఆదేశించింది. అలాగే ల్యాబ్‌లలో సేకరించిన నమూనాల ఫలితాలు వచ్చిన వెంటనే  కోవిడ్ పోర్టల్‌లో నమోదు చేయాలని సూచనలు జారీ చేసింది. కోవిడ్ ప్రోటోకాల్‌ను అనుసరించి నమూనాలను జాగ్రత్త చేయాలని వైద్యారోగ్యశాఖ స్పష్టం చేసింది.


ఐడీ నెంబరు, సరైన మూత లేకుండా  నమూనాల సేకరణ, బాక్సింగ్ లాంటి విధానాలు పాటించకుండా నిర్ధారణా పరీక్షలు చేసేందుకు వీల్లేదని పేర్కొంది. ఫలితాలను ఎంఎస్ఎస్ కోవిడ్ పోర్టల్‌లో నమోదు చేయకుంటే తిరస్కరించాలని ఆదేశాలు జారీ చేసింది. రెడ్ మార్కింగ్ చేసిన నమూనాలను ప్రాధాన్యతగా గుర్తించి తక్షణం ఫలితాలు ఇవ్వాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.


ఒకసారి కరోనా పాజిటివ్ సోకిన రోగికే మళ్లీ పాజిటివ్ వస్తే ఆ  ఫలితాన్ని కొత్తదిగా ప్రకటించొద్దని సూచించింది. ఎంఎస్ఎస్ కోవిడ్ పోర్టల్, ఐసీఎంఆర్ పోర్టల్‌లో నమోదు చేసే ఫలితాలు ఆరుగంటలకన్నా ఆలస్యం అయ్యేందుకు వీల్లేదని వీఆర్డీఎల్ ల్యాబ్స్‌కు ప్రభుత్వం సూచించింది. 

Updated Date - 2020-07-14T23:50:38+05:30 IST