రాష్ట్ర ప్రభుత్వం అప్పుల్లో ఉన్న మాట వాస్తవమే: సజ్జల
ABN , First Publish Date - 2021-08-04T20:48:07+05:30 IST
రాష్ట్ర ప్రభుత్వం అప్పుల్లో ఉన్న మాట వాస్తవమేనని, ఉద్యోగులకు జీతాలు చెల్లించడం బాగా ఆలస్యమవుతోందని ప్రభుత్వ సలహాదారు
తిరుపతి: రాష్ట్ర ప్రభుత్వం అప్పుల్లో ఉన్న మాట వాస్తవమేనని, ఉద్యోగులకు జీతాలు చెల్లించడం బాగా ఆలస్యమవుతోందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. కరోనా ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసిందని చెప్పారు. ‘‘అమర్రాజా ఫ్యాక్టరీ మూసేయమని చెప్పలేదు. కంపెనీ ఏపీలోనే ఉంటే మాకు అభ్యంతరం లేదు. గాలి, నీరు కాలుష్యం చేయకుండా పరిశ్రమ నడుపుకోవచ్చు. పీసీబీ నిబంధనలకు తగ్గట్టుగానే చర్యలు తీసుకున్నట్టు... కోర్టుకు చూపించి అమర్రాజా కంపెనీ ఇక్కడే ఉండవచ్చు. రాష్ట్రంలో 66 పరిశ్రమలకు నోటీసులు ఇచ్చాం’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.
మరోవైపు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతోన్న రాష్ట్ర ప్రభుత్వం... కొత్త రుణాల కోసం ప్రపంచబ్యాంకు ముందు సాగిలపడింది. వారు విధించిన షరతులకు ‘జీ హుజూర్’ అంటోంది. ‘సాల్ట్’ ప్రాజెక్టు అమలు కోసం సుమారు రూ.1,870 కోట్ల(250 మిలియన్ డాలర్ల) రుణం ఇవ్వడానికి ప్రపంచ బ్యాంకు విధించిన షరతులకు వైసీపీ ప్రభుత్వం తలూపింది. మీ షరతులకు మేం సిద్ధం.. రుణం ఇస్తే చాలంటూ ఒప్పందం చేసుకుంది. అందులో భాగంగానే రాష్ట్రంలో 25 వేలకు పైగా పోస్టులు ఖాళీలున్నా డీఎస్సీ ఊసెత్తకుండా కాలయాపన చేస్తోంది.