ఏపీ హైకోర్టుకు హాజరైన ఏడుగురు ఐఏఎస్ అధికారులు
ABN , First Publish Date - 2021-08-31T22:00:37+05:30 IST
ఆంధ్రప్రదేశ్లో పాఠశాలల స్థలాల్లో రైతు భరోసా కేంద్రాలు, సచివాలయ నిర్మాణంపై దాఖలైన పిటిషన్పై...
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో పాఠశాలల స్థలాల్లో రైతు భరోసా కేంద్రాలు, సచివాలయ నిర్మాణంపై దాఖలైన పిటిషన్పై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. దీనికి సంబంధించి విచారణకు ఏడుగురు ఐఏఎస్ అధికారులు హాజరయ్యారు. గతంలో ఆదేశాలు ఇచ్చినప్పటికీ ప్రభుత్వం నిర్మాణాలు కొనసాగించడంపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి ఇవాళ మొత్తం నివేదిక ఇవ్వాలని, ఐఏఎస్ అధికారులు హాజరు కావాలని హైకోర్టు ఆదేశాల మేరకు మంగవారం పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజా శంకర్, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బి.రాజశేఖర్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వి.చినవీరభద్రుడు, జలవనరుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్యామలారావు, గతంలో పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసిన విజయకుమార్, ఎంఎం నాయక్ తదితరులు హాజరయ్యారు.
రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1160 చోట్ల రైతు భరోసా కేంద్రాలు, సచివాలయాల నిర్మాణాలు చేస్తున్నట్లు ప్రభుత్వం నివేదిక ఇచ్చింది. అందులో భాగంగా 450 నిర్మాణాలు వేరే ప్రాంతాలకు తరలిస్తున్నామని చెప్పారు. మిగిలిన నిర్మాణాలను కూడా నాలుగు వారాల్లోగా తొలగించాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేస్తూ తదుపరి విచారణ అక్టోబర్ 1వ తేదీకి వాయిదా వేసింది.