ఎస్ఈసీ నిర్ణయంపై హైకోర్టులో లంచ్మోషన్ పిటిషన్లు...మధ్యాహ్నం విచారణ
ABN , First Publish Date - 2021-03-02T18:39:27+05:30 IST
మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్లు వేసేందుకు అవకాశం కల్పిస్తూ ఎస్ఈసీ తీసుకున్న నిర్ణయంపై హైకోర్టులో నాలుగు లంచ్మోషన్ పిటీషన్లు దాఖలయ్యాయి.
అమరావతి: మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్లు వేసేందుకు అవకాశం కల్పిస్తూ ఎస్ఈసీ తీసుకున్న నిర్ణయంపై హైకోర్టులో నాలుగు లంచ్మోషన్ పిటీషన్లు దాఖలయ్యాయి. లంచ్ మోషన్ పిటీషన్లను స్వీకరించిన హైకోర్టు మధ్యాహ్నం తరువాత విచారించనుంది. చిత్తూరు జిల్లా పుంగనూరు, తిరుపతి, కడప జిల్లా రాయచోటి, ఎర్రగంట్లలో నామినేషన్లు గతంలో వేయలేకపోయిన వారికి మళ్లీ అవకాశం కల్పిస్తూ ఎస్ఈసీ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈరోజు మధ్యాహ్నంలోపు నామినేషన్లు దాఖలు చేయాలని ఎస్ఈసీ పేర్కొంది. గతంలో నామినేషన్లకు అవకాశం కల్పించిన సమయంలో వేయని వారికి మరల ఎలా అవకాశం ఇస్తారని సవాల్ చేస్తూ కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ పూర్తై ఉపసంహరణ జరుగుతున్న తరుణంలో కొత్త నామినేషన్లు ఎలా అనుమతిస్తారని పిటీషనర్లు ప్రశ్నించారు.