కలెక్టర్ ఆర్డర్స్.. హైకోర్టు డిస్మిస్
ABN , First Publish Date - 2020-12-05T18:32:14+05:30 IST
జిల్లా మలేరియా అధికారి అల్లాడి జ్ఞానశ్రీని ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ కలెక్టర్ శామ్యూల్ ఆనంద్కుమార్, డీఎంహెచ్వో డాక్టర్ జే యాస్మిన్ జారీ చేసిన ఉత్త ర్వులను హైకోర్టు డిస్మిస్ చేసింది.
పెండింగ్ బిల్లుల విషయంలో డీఎంవో సరెండర్
హైకోర్టును ఆశ్రయించిన జ్ఞానశ్రీ
గుంటూరు (ఆంధ్రజ్యోతి): జిల్లా మలేరియా అధికారి అల్లాడి జ్ఞానశ్రీని ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ కలెక్టర్ శామ్యూల్ ఆనంద్కుమార్, డీఎంహెచ్వో డాక్టర్ జే యాస్మిన్ జారీ చేసిన ఉత్త ర్వులను హైకోర్టు డిస్మిస్ చేసింది. పెండింగ్ బిల్లుల కు సంబంధించి చెక్కుపై సంతకం చేసే విషయం లో తన ఆదేశాలను అమలు చేయని కారణంగా కలెక్టర్ ఆమెపై ఆగ్రహోదగ్ధుడై సరెండర్ చేశారు. ఈ ఉత్తర్వులపై డీఎంవో హైకోర్టులో న్యాయవాది జడ శ్రవణ్కుమార్ ద్వారా రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రతివాదులుగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరి, ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్, కలెక్టర్, డీఎంహెచ్వోలని చేర్చారు. పిటిషన్ని స్వీకరించిన హైకోర్టు ప్రాథమిక ఆధా రాలను పరిశీలించి కలెక్టర్ ఉత్తర్వులను డిస్మిస్ చేసింది. దీంతో ఆమె హైకోర్టు ఉత్తర్వులు తీసుకొని వచ్చి తిరిగి విధుల్లో చేరేందుకు సంసిద్ధమయ్యారు. కాగా సరెండర్ ఉత్తర్వులు జారీ కావడానికి ముం దు కలెక్టర్, ఆమెకు మధ్య జరిగిన సంభాషణ ఆడి యో లింక్ ద్వారా సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఆ సంభాషణ ఇలా సాగింది...
డీఎంవో: కాదు సార్ ఒకసారి నా మాట వినండి.
కలెక్టర్: నేను ఎంత మంచి ఉద్దేశంతో పిలిచాను. ఎడ్యుకేట్ చేద్దామని పిలిచాను. దానిని నువ్వు ఎందుకు ఆలస్యం చేశావు. నా ఆఫీసు నుంచి ఇవ్వలేదు. నువ్వే పెట్టుకోమ్మా అంటావు. నీ ఆఫీసు నుంచి ఇవ్వాలా? నేను కదా చెప్పింది ఇక్కడ. ఎవరు చెప్పింది ఎవరు?
డీఎంవో: సార్ నన్ను ఒక్కసారి చెప్పనివ్వండి సార్
కలెక్టర్: నేను చెప్పనివ్వను. నువ్వు పోయి సంతకం పెట్టి మాట్లాడు తర్వాత. సంతకం పెట్టకపోతే సస్పెండ్ అవుతావు. గో గెట్ లాస్టు.
డీఎంవో: ఒక్కసారి సార్.. సార్
కలెక్టర్: గో ఐ సే. నేనేమి వినను. వెళ్లి ఆ చెక్కుపై సంతకం చేసి రా. చేసి రా పో.
కలెక్టరేట్ సహాయకుడు : వచ్చేయండి... మేడమ్ గారు.. మీరు బయటకు వచ్చేయండి.
కాగా వైద్య శాఖకు చెందిన అధికారితో కలెక్టర్ ఇలా ఆగ్రహానికి గురి కావడం రెండోసారి. ఇటీవల నరసరావుపేటలో జరిగిన కరోనా సమీక్షలోనూ నాదెండ్ల పీహెచ్సీ వైద్యుడు సోమ్లానాయక్పై ఆగ్ర హం వ్యక్తం చేశారు. పోలీసులను పిలిచి అరెస్టు చేయమని, లోపల వేయమని ఆదేశాలు జారీ చేశా రు. ఆ సందర్భంలో కలెక్టర్ తీరుపై ఉద్యోగ సంఘా లు రాష్ట్ర స్థాయిలో తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి. వివాదం పెద్దది కాకుండా అధికార పార్టీ నేతలు జోక్యం చేసుకొని ఇద్దరి మధ్యన రాజీ కుదిర్చారు. ఆ సంఘటన మరువక ముందే మలేరియా డిపార్ట్మెంట్లో ప్రైవేటు వ్యక్తి చేసిన పనికి సంబంధించి చెక్కుపై సంత కం చేయలేదని జిల్లా మలేరియా అధికారిపై కలెక్టర్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడం చర్చనీ యాంశంగా మారింది.