వైసీపీ ఎమ్మెల్యేగా కాదు, బాధ్యత గల పౌరుడిగా మాత్రమే హైకోర్టు తీర్పులపై మాట్లాడా...
ABN , First Publish Date - 2020-05-30T08:57:29+05:30 IST
అనకాపల్లి ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు గుడివాడ అమర్కు హైకోర్టు నోటీసులు జారీచేసింది. న్యాయస్థానం నిర్ణయాలపై వ్యాఖ్యానించినందుకు వివరణ కోరింది.
ఎమ్మెల్యే అమర్కు హైకోర్టు నోటీసులు
డాక్టర్ సుధాకర్ కేసు సీబీఐకి ఇవ్వడంపై వ్యాఖ్యానించిందుకు...
ఎమ్మెల్యేగా కాదు, బాధ్యత గల పౌరుడిగా మాత్రమే మాట్లాడా...
ప్రజాస్వామ్య దేశంలో ఆ మాత్రం స్వేచ్ఛ కూడా లేదా!?
విశాఖపట్నం (ఆంధ్రజ్యోతి): అనకాపల్లి ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు గుడివాడ అమర్కు హైకోర్టు నోటీసులు జారీచేసింది. న్యాయస్థానం నిర్ణయాలపై వ్యాఖ్యానించినందుకు వివరణ కోరింది. హైకోర్టు నిర్ణయాలపై వ్యాఖ్యానాలు పెరుగుతున్న నేపథ్యంలో న్యాయస్థానం రాష్ట్రంలో గతంలో 49 మందికి నోటీసులు జారీ చేయాల్సిందిగా ఆదేశించింది. శుక్రవారం మరో44 మందికి నోటీసులు జారీచేసింది. అందులో అమర్ పేరు కూడా ఉంది. నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ కేసు ఇటీవల హైకోర్టుకు వెళ్లగా, నివేదికలు పరిశీలించిన న్యాయస్థానం...వాటిలో వేర్వేరు అంశాలు వున్నాయని, రాష్ట్ర పోలీసుల దర్యాప్తు తీరు లోపభూయిష్టంగా వున్నందున కేసును సీబీఐకి అప్పగిస్నుట్టు ప్రకటించింది. ఆ నిర్ణయంపై ఎమ్మెల్యే గుడివాడ అమర్ ప్రత్యేకంగా విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ఇటీవల కొన్ని కేసుల్లో న్యాయస్థానం ఇస్తున్న తీర్పులు ఆమోదయోగ్యంగా లేవని వ్యాఖ్యానించారు.
ఈ కేసును సీబీఐకి అప్పగించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. దీనిపై హైకోర్టు ఆయనకు నోటీసులు జారీచేసింది. దీనిపై అమర్ శుక్రవారం విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ, కోర్టు నోటీసులు జారీ చేసినట్టు, తన మిత్రుడు ఫోన్ చేసి చెప్పారని, అవి ఇంకా తనకు అందలేదన్నారు. తాను ఎమ్మెల్యేగా ఆ వ్యాఖ్యలు చేయలేదని, ఓ బాధ్యత గల పౌరుడిగా తన అభిప్రాయం మాత్రమే చెప్పానన్నారు. ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్యదేశమైన భారతదేశంలో ఆ పాటి స్వేచ్ఛ కూడా లేదా? అని ప్రశ్నించారు. న్యాయస్థానం తనను పిలిచి బోనులో నిలబెట్టి ప్రశ్నిస్తే...ఇదే సమాధానం చెబుతానని వివరించారు.