పాత్రికేయుల వినతిపై చర్యలు తీసుకోండి: హైకోర్టు
ABN , First Publish Date - 2020-08-13T07:14:54+05:30 IST
పాత్రికేయుల వినతిపై చర్యలు తీసుకోండి: హైకోర్టు
అమరావతి, ఆగస్టు 12(ఆంధ్రజ్యోతి): కరోనా నేపథ్యంలో పాత్రికేయులకు ఆర్థికసాయం చేయాలంటూ అందిన వినతిపత్రంపై రెండువారాల్లోగా తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈమేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తి, జస్టిస్ కె.లలితతో కూడిన ధర్మాసనం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. మచిలీపట్నానికి చెందిన వై.సూర్య రాజేశ్వరరావు దాఖలు చేసిన పిటిషన్పై ధర్మాసనం ముందు విచారణ జరగ్గా... పిటిషనర్ తరఫున ఎస్.ప్రణతి వాదనలు వినిపించారు. గుర్తింపు పొందిన పాత్రికేయులను ఆదుకునేలా రాష్ట్రప్రభుత్వం ఒక పథకం రూపొందించి, 25వేలు చొప్పున ఆర్థికసాయం చేయాలని, ఆమేరకు ఉత్తర్వులు జారీ చేయాలని అభ్యర్థించారు. ఆర్థికసాయం అందించాలని ప్రభుత్వాన్ని బలవంతం చేయలేమని, అయితే వినతిపత్రంపై రెండు వారాల్లోగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది.