దర్యాప్తులో స్థిరత్వం తప్పనిసరి: డీజీపీ
ABN , First Publish Date - 2020-08-13T07:30:10+05:30 IST
దర్యాప్తులో స్థిరత్వం తప్పనిసరి: డీజీపీ
‘‘అందుబాటులో ఉన్న సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించుకుని స్థిరత్వంతో దర్యాప్తు చేస్తే ఎటువంటి కేసుల్లో అయినా కచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి. నేరాల దర్యాప్తులో ఎప్పటికప్పుడు నైపుణ్యం పెంచుకోవాలి’’ అని డీజీపీ గౌతమ్ సవాంగ్ రాష్ట్ర పోలీసులకు సూచించారు. రాష్ట్రంలో గత తొమ్మిది నెలలుగా నమోదైన పలు కేసుల దర్యాప్తులో సత్తా చాటి, శిక్షలు పడేలా చేసిన పోలీసు అధికారులకు ఆయన ఏబీసీడీ అవార్డులు అందజేశారు. మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పోలీస్ బాస్ మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా కీలక కేసులు ఛేదించి అవార్డులు పొందిన పోలీసుల నుంచి ఇతరులు స్ఫూర్తి పొందాలన్నారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ, కన్సోలేషన్ బహుమతులు... ఒక్కో త్రైమాసికానికి నాలుగు చొప్పున మూడు త్రైమాసికాలకు ఒకేసారి ఇచ్చారు. వీటితోపాటు ఎస్సీ, ఎస్టీ కేసుల దర్యాప్తులో ప్రతిభ కనబరిచే వారికి కొత్తగా మరో అవార్డు ప్రవేశ పెట్టారు. మొత్తం 13 మంది దర్యాప్తు అధికారులతోపాటు ఆ బృందంలోని పోలీసులకు డీజీపీ సవాంగ్ అవార్డులు అందజేశారు.