శ్రీశైలం, సాగర్‌.. స్వాధీనం

ABN , First Publish Date - 2021-10-13T08:08:09+05:30 IST

రెండు తెలుగు రాష్ట్రాల్లోని నీటి ప్రాజెక్టు లు గురువారం(14వ తేదీ) నుంచి కృష్ణా, గోదావరి యాజమాన్య బోర్డుల పరిధిలోకి దశలవారీగా వెళ్లిపోతున్నాయి.

శ్రీశైలం, సాగర్‌.. స్వాధీనం

జల విద్యుత్కేంద్రాలు కూడా.. కృష్ణా బోర్డు తీర్మానం


అమరావతి, అక్టోబరు 12(ఆంధ్రజ్యోతి): రెండు తెలుగు రాష్ట్రాల్లోని నీటి ప్రాజెక్టు లు గురువారం(14వ తేదీ) నుంచి కృష్ణా, గోదావరి యాజమాన్య బోర్డుల పరిధిలోకి దశలవారీగా వెళ్లిపోతున్నాయి. ఇప్పటికే గోదావరి బోర్డు పెద్దవాగు రిజర్వాయరును తన అజమాయిషీలోకి తీసుకోగా.. తాజాగా కృష్ణా నదిపై నిర్మించిన జంట జలాశయాలైన శ్రీశైలం, నాగార్జున సాగర్‌లను విద్యుత్కేంద్రాలతో సహా తన స్వాధీనంలోకి తీసుకోవాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ) తీర్మానించింది. గోదావరి, కృష్ణా నదులపై తెలుగు రాష్ట్రాలు నిర్మించిన ప్రాజెక్టులను స్వాధీనం చేసుకునేలా కేంద్ర జలశక్తి శాఖ జారీ చేసిన గెజిట్‌ అమలు కోసం మంగళవారం హైదరాబాద్‌ జల సౌధలో కేఆర్‌ఎంబీ చైర్మన్‌ ఎంపీ సింగ్‌ అధ్యక్షతన బోర్డు ప్రత్యేక సమావేశం జరిగింది. రాష్ట్ర జల వనరుల శాఖ కార్యదర్శి శ్యామలరావు, ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి, తెలంగాణ నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్‌, ఈఎన్‌సీ మురళీధర్‌రావు పాల్గొన్నారు. సమావేశం ప్రారంభం నుంచే వాడీవేడిగా వాదనలు జరిగాయి. గెజిట్‌లో చేర్చిన 29 ప్రాజెక్టుల ప్రధాన కాలువల(అవుట్‌లెట్ల)ను కాకుండా.. విద్యుత్కేంద్రా లు లేకుండా.. 17 ప్రాజెక్టుల పా యింట్ల జాబితాను మాత్రమే చైర్మన్‌ ప్రవేశపెట్టడంపై ఏపీ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. విద్యుత్కేంద్రాలతో కూడిన అవుట్‌లెట్లు లేకుండా ప్రాజెక్టుల పా యింట్లను స్వాధీనం చేసుకోవడం వల్ల ప్రయోజనమేమిటని నిలదీశారు. విద్యుత్కేంద్రాలతో కూడిన అవుట్‌లెట్లు ఉండి తీరాల్సిందేనని తేల్చిచెప్పారు. ఈ 17 అవుట్‌లెట్లతోనే ముందుకు వెళ్తామంటే తాము అంగీకరించబోమని స్పష్టం చేశారు. బోర్డు ఇదే వైఖరితో ముందుకెళ్తే తాము ప్రాజెక్టులను అప్పగించబోమని ఖండితంగా చెప్పారు.


అక్రమ విద్యుత్‌తోనే బీజం పడింది..: శ్రీశైలం, సాగర్‌, పులిచింతలలో తెలంగాణ అక్రమంగా జల విద్యుదుత్పత్తి చేయడాన్ని ఏపీ ప్రస్తావించింది. బోర్డు పరిధిని ప్రకటించమనడం వెనుక కారణం ఇదేనని పేర్కొంది. ‘శ్రీశైలం, సాగర్‌, పులిచింతల నుంచి అక్రమంగా విద్యుదుత్పత్తి చేస్తుంటే అభ్యంతరం చెప్పాం. విద్యుదుత్పత్తి ఆపాలని బోర్డు ఆదేశాలిచ్చినా తెలంగాణ పాటించలేదు. అయినా కేఆర్‌ఎంబీ ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఇక బోర్డు లు ఎందుకు’ అని నిలదీసింది. తీరా కేంద్రం బోర్డు పరిధిని ప్రకటించాక.. 29 ప్రాజె క్టు పాయింట్లలో విద్యుత్కేంద్రాలను మినహాయించి 17 పాయింట్లతో కూడిన జాబితాను మాత్రమే సమావేశం ముందు పెట్టడమేమిటని నిలదీసింది. దీంతో.. శ్రీశైలం, నాగార్జునసాగర్‌లను విద్యుత్కేంద్రాల అవుట్‌లెట్లతో కలిపి స్వాధీనం చేసుకుంటామని కేఆర్‌ఎంబీ చైర్మన్‌ స్పష్టం చేశారు. దీనిపై తెలంగాణ లేవనెత్తిన అభ్యంతరాలను బోర్డు పట్టించుకోలేదు. చివరకు శ్రీశైలం, నాగార్జునసాగర్‌లతో పాటు వాటి విద్యుదుత్పత్తి కేంద్రాలతో కూడిన అవుట్‌లెట్లనూ స్వాధీనం చేసుకుంటున్నట్లు తీర్మానం చేసింది. దీంతో జంట జలాశయాలను కేఆర్‌ఎంబీకి స్వాధీనం చేసేందుకు ఆమోదిస్తామని.. కానీ తమ సీఎం కేసీఆర్‌తో చర్చించాక నిర్ణయాన్ని వెల్లడిస్తామని రజత్‌కుమార్‌ చెప్పారు. తెలంగాణ అప్పగించిన వెంటనే తాము కూడా ప్రాజెక్టులను అప్పగిస్తూ ఉత్తర్వులు జారీచేస్తామని శ్యామలరావు తెలిపారు. జల వనరుల శాఖ, ఏపీ జెన్కో ఉత్తర్వులిస్తాయన్నారు. ఫలితంగా ప్రాజెక్టుల అప్పగింతపై స్పష్టత వచ్చింది. అయితే.. ఆ ప్రాజెక్టులను గురువారం నుంచి సూత్రప్రాయంగా స్వాధీనం చేసుకుంటున్నా.. పూర్తిస్థాయిలో నిర్వహణలోకి తీసుకునేందుకు 3 నెలల సంధి కాలం కావాలని కేఆర్‌ఎంబీ పేర్కొంది. దీనికి రెండు రాష్ట్రాలూ ఆమోదించాయి.


నిర్వహణ వ్యయమెలా?: ప్రాజెక్టుల అవుట్‌లెట్ల అప్పగింత అంశం కొలిక్కి వచ్చాక.. కీలకమైన నిర్వహణ వ్యయంపై చర్చ జరిగింది. ఒక్కో బోర్డుకు ఒక్కో రాష్ట్రం రూ.200 కోట్ల చొప్పున చెల్లించాలంటున్నారని.. ఇంత మొత్తం ఎందుకని రెండు రాష్ట్రాలూ ప్రశ్నించాయి. దీనిపై త్వరలోనే వివరాలు వెల్లడిస్తామని కేఆర్‌ఎంబీ చైర్మన్‌ బదులిచ్చారు. కాగా.. తాము రూ.8 కోట్లు బోర్డుకివ్వాలని నిర్ణయించామని.. ఈ మొత్తాన్ని త్వరలోనే అందజేస్తామని ఆంధ్ర అధికారులు తెలిపారు.


కేఆర్‌ఎంబీ పరిధిలోకి వెళ్లే ఆంధ్రా ప్రాజెక్టులివే..

శ్రీశైలం స్పిల్‌వే, కుడిగట్టు విద్యుత్కేంద్రం, పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌, హంద్రీ-నీవా, మల్యాల, ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాలు, సుంకేశుల.. నాగార్జున సాగర్‌ కుడికాలువ.


తెలంగాణ ప్రాజెక్టులివీ..: శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్కేంద్రం, కల్వకుర్తి ఎత్తిపోతల మొదటి పంప్‌హౌస్‌, నాగార్జున సాగర్‌ కింద ఉన్న 15 పాయింట్లు, కుడి, ఎడమ కాలువలతో పాటు ప్రధాన విద్యుదుత్పత్తి కేంద్రం, ఎడమ కాలువ కింద ఉన్న పాయింట్లు, ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు, హైదరాబాద్‌ మంచినీటి సరఫరా ప్రాజెక్టు, సాగర్‌ టెయిల్‌ పాండ్‌ కింద హెడ్‌వర్క్స్‌ విద్యుత్కేంద్రం, పులిచింతల హెడ్‌వర్క్స్‌ విద్యుత్‌ బ్లాక్‌, ఆర్డీఎస్‌ క్రాస్‌ రెగ్యులేటర్‌, తుమ్మిళ్ల ఎత్తిపోతల.

Updated Date - 2021-10-13T08:08:09+05:30 IST