మేం హత్యాయత్నం చేశామంట సారూ..

ABN , First Publish Date - 2021-11-29T09:17:47+05:30 IST

మేం హత్యాయత్నం చేశామంట సారూ..

మేం హత్యాయత్నం చేశామంట సారూ..

రెండేళ్లుగా కోర్టుల చుట్టూ తిప్పుతున్నారు.. వృద్ధ దంపతుల గోడు 


పిడుగురాళ్ల, నవంబరు 28: వైసీపీ అధికార దుర్వినియోగానికి ఇదో పరాకాష్ఠ. తమ పార్టీకి అనుకూలంగా లేరని మైనార్టీ వృద్ధ దంపతులపై హత్యాయత్నం కేసు నమోదు చేయించారు. 70 ఏళ్లకు పైబడిన వయసులో, సరిగా నడవలేని ఆ వృద్ధ దంపతులు రెండేళ్లుగా కోర్టుల చుట్టూ తిరగలేక అవస్థలు పడుతున్నారు. గుంటూ రు జిల్లా మాచవరం మండలం తురకపాలెం గ్రామానికి చెందిన షేక్‌ మాబు, చాంద్‌బీ దంపతుల దుస్థితి ఇది. వైసీపీ అధికారంలోకి వచ్చిన 2 నెలలకే ఈ వృద్ధ దంపతులపై ఐపీసీ 147, 148, 324, 307, 149 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యా యి. అప్పటి నుంచి కోర్టుల చుట్టూ తిరుగుతున్న వారు ఆదివారం పిడుగురాళ్లకు వచ్చిన మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావును కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. పల్నాడులో ఇలాంటి దాష్టీకాలు అనేకం జరిగాయి. దీంతో ఎంతోమంది ఊరొదిలి వెళ్లిపోయారు.  


మాకే పాపం తెలియదు 

మాకే పాపం తెలియదు. కాటికి కాళ్లుచాపే వయసులో ఉన్నాం. మాపై హత్యాయత్నం కేసు మోపారు. కదల్లేని వయసులో మరణాయుధాలతో దాడిచేశామంటే నమ్మశక్యమేనా? వైసీపీ నేతల ఒత్తిడితో అక్రమ కేసులు పెట్టి ఈ వయసులోనూ కోర్టుల చుట్టూ తిప్పుతున్నారు. చస్తే కేసులు పోతాయేమో తెలియదు. కానీ, ఇప్పుడు మాత్రం తిరగలేక చస్తున్నాం.      -మాబు, చాంద్‌బీ దంపతులు 

Updated Date - 2021-11-29T09:17:47+05:30 IST