కొనలేం.. తినలేం

ABN , First Publish Date - 2021-10-14T08:40:15+05:30 IST

కొనలేం.. తినలేం

కొనలేం.. తినలేం

చుక్కలనంటుతున్న కూరగాయల ధరలు

పండుగ పూట కూడా కొనేటట్టు లేవు

నెల రోజుల్లో చాలావాటి ధరలు రెట్టింపు 

గులాబ్‌ తుఫాన్‌తో దెబ్బతిన్న పంటలు

డిమాండ్‌ కంటే తక్కువగా మార్కెట్‌కు 


మచిలీపట్నం టౌన్‌, అక్టోబరు 13: కూరగాయల ధరలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. నెల రోజులతో పోలిస్తే దాదాపు అన్ని కూరగాయల ధరలు రెట్టింపు అయ్యాయి. దసరా పండుగ సమయంలో ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఇక నిత్యావసర వస్తువుల ధరలదీ ఇదే పరిస్థితి. అసలే కరోనా కష్టాల కారణంగా ఉపాధి అవకాశాలు సరిగా లేక ఇబ్బంది పడుతున్న సామాన్య మధ్యతరగతి వర్గాల వారు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. బహిరంగ మార్కెట్‌, రైతుబజార్లలో కూరగాయల ధరలు గణనీయంగా పెరిగాయి. ఇటీవల గులాబ్‌ తుఫాన్‌ కారణంగా కూరగాయల తోటలు దెబ్బతినడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. కృష్ణా జిల్లాలో బందరు మండలం గోపువానిపాలెం, మంగినపూడి, తోట్లవల్లూరు, పమిడిముక్కల, ఉయ్యూరు, పామర్రు, మోపిదేవి, అవనిగడ్డ, నాగాయలంక, పెనమలూరు, మైలవరం, కంచికచర్ల, జగ్గయ్యపేట తదితర ప్రాంతాల్లో కూరగాయల తోటల సాగు రైతులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా ఐదు వేల హెక్టార్లలో కూరగాయల సాగు జరుగుతోంది. ప్రతి రోజూ జిల్లాలో 24 రైతుబజార్లకు వివిధ ప్రాంతాల నుంచి కూరగాయలు వస్తూ ఉంటాయి. అయితే గులాబ్‌ తుఫాన్‌ ప్రభావంతో దిగుబడి తగ్గిపోయింది. డిమాండ్‌ మేరకు మార్కెట్‌కు కూరగాయలు రావడం లేదు. దీంతో ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. మచిలీపట్నం రైతుబజార్‌కు 800 క్వింటాళ్ల కూరగాయలు సరఫరా అయ్యేవి. ఇప్పుడు 500 క్వింటాళ్లు మాత్రమే వస్తున్నాయి. వినియోగదారులు ఏ కూరగాయలు తక్కువ ధరలో ఉంటే వాటిని తీసుకెళుతున్నారు. జిల్లాలో కూరగాయల దిగుబడి తక్కువగా ఉండటంతో ఇతర జిల్లాల నుంచి వస్తున్నాయి. రైతుబజార్లలో కంటే బహిరంగ మార్కెట్‌లో అధిక ధరలకు విక్రయిస్తున్నారు. 


15 రోజుల్లో ధరలు తగ్గొచ్చు 

తుఫాన్‌ కారణంగా తోటలు పాడయ్యాయి. దీంతో రైతుబజార్‌కు తక్కువగా వస్తున్నాయి. బహిరంగ మార్కెట్‌లో ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి. దీంతో రైతుబజార్‌కు వచ్చే వినియోగదారుల సంఖ్య పెరిగింది. ఉద్యానవన శాఖ చెబుతున్న సమాచారం ప్రకారం 15 రోజుల్లో ధరలు తగ్గే అవకాశాలు ఉన్నాయి.

- అమీర్‌బాబు, ఈవో, మచిలీపట్నం 



Updated Date - 2021-10-14T08:40:15+05:30 IST