త్వరలో జనసేనాని జిల్లాల పర్యటన

ABN , First Publish Date - 2021-10-25T08:41:37+05:30 IST

త్వరలో జనసేనాని జిల్లాల పర్యటన

త్వరలో జనసేనాని జిల్లాల పర్యటన

సమస్యలపై మరింత పోరాటం

పార్టీ జిల్లాల అధ్యక్షులతో భేటీ అయిన పవన్‌


అమరావతి, అక్టోబరు 24(ఆంధ్రజ్యోతి): సామాన్య ప్రజల కష్టాలను, వారు ఎదుర్కొంటున్న రాజకీయ ఒత్తిళ్లను దూరం చేసేలా జనసేన కార్యక్రమాలు ఉండాలని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ నాయకులకు సూచించారు. త్వరలోనే ఏపీలోని అన్ని జిల్లాల్లోనూ పర్యటించాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఈ మేరకు ఆదివారం హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో జనసేన జిల్లాల అధ్యక్షులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ధ్వంసమైన రహదారుల గురించి ప్రజాస్వామ్య పద్ధతిలో ముందుగా సమస్యను అందరి దృష్టికీ తీసుకువెళ్లామని గుర్తుచేశారు. మరమ్మతులకు ప్రభుత్వానికి సమయం ఇచ్చినా స్పందించలేదన్నారు. జనసేన శ్రమదానం ద్వారా మరమ్మతులు చేపడితే ప్రభుత్వం అనుసరించిన పోకడలు ప్రజలందరూ చూశారని అన్నారు. శ్రమదానం కార్యక్రమానికి జాతీయ స్థాయిలో సానుకూల స్పందన వచ్చిందని తెలిపారు. రాష్ట్ర, జిల్లా, మండలస్థాయిలో ఏ కార్యక్రమం నిర్వహించినా ముందుగా ఆ పరిధిలో దెబ్బతిన్న రోడ్లను శ్రమదానంతో బాగుచేయాలని సూచించారు. శ్రమదానం స్ఫూర్తిని కొనసాగించాలన్నారు. ‘‘మనం ప్రజాపక్షం వహిస్తున్నాం. ఎవరికీ భయపడేది లేదు. ఏ అంశాన్నైనా ప్రజా కోణంలోనే విశ్లేషించి వారికి అండగా నిలుద్దాం. ప్రతి జిల్లాలో పర్యటనకు షెడ్యూల్‌ సిద్ధం చేస్తున్నాం. జిల్లాలకు వెళ్లినప్పుడు అక్కడ.. పార్టీ అంశాలపై సమగ్రంగా సమీక్షలు నిర్వహిస్తాం’’ అని పవన్‌ స్పష్టం చేశారు. పార్టీ శ్రేణులను జిల్లా అధ్యక్షులు, కార్యవర్గం అనుసంధానం చేసుకొంటూ ముందుకు తీసుకువెళ్లాలని పీఏసీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ అన్నారు. నవంబరు 15 నాటికిపార్టీ మండలాధ్యక్షులు, మండల కమిటీల నియామక ప్రక్రియ పూర్తి చేయాలని పార్టీ నిర్ణయించినట్టు కందుల దుర్గేశ్‌ అన్నారు. ఫించన్లు ఆపేయడం, రేషన్‌ కార్డుల కోత, అమ్మఒడి వాయిదా వంటి అంశాలు సమావేశంలో చర్చకు వచ్చాయని చెప్పారు. జిల్లాల వారీగా సమస్యలపై శ్రేణులు పోరాటం చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. పార్టీ క్రియాశీలక సభ్యులకు శిక్షణ తరగతులు నిర్వహించాలని నిర్ణయించినట్టు వివరించారు.  

Updated Date - 2021-10-25T08:41:37+05:30 IST