కోనసీమ కుర్రాడికి‘చేంజ్‌మేకర్‌’ టైటిల్‌

ABN , First Publish Date - 2021-10-27T08:37:20+05:30 IST

కోనసీమ కుర్రాడికి‘చేంజ్‌మేకర్‌’ టైటిల్‌

కోనసీమ కుర్రాడికి‘చేంజ్‌మేకర్‌’ టైటిల్‌

నెదర్లాండ్స్‌కు చెందిన కిడ్స్‌రైట్స్‌ ఫౌండేషన్‌ ప్రకటన

సమాజంలో మార్పుకోసం చేస్తున్న కృషికి గుర్తింపు


పి.గన్నవరం, అక్టోబరు 26: నిరుపేద చిన్నారుల జీవితాల్లో విద్య, వైద్య విధానంలో మార్పుకోసం పోరాటం చేస్తున్న కోనసీమ యువకుడికి అంతర్జాతీయ గుర్తింపు దక్కింది. ‘సేవ్‌ ద చైల్డ్‌ ఫ్యూచర్‌ ప్లాట్‌ఫాం’ను స్థాపించి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సేవలందిస్తున్న పసుపులేటి నాగసతీశ్‌కు.. నెదర్లాండ్స్‌కి చెందిన కిడ్స్‌రైట్స్‌ ఫౌండేషన్‌ ‘చేంజ్‌మేకర్‌’ టైటిల్‌ను ప్రకటించింది. ఈ విషయాన్ని ఆ సంస్థ మెయిల్‌ ద్వారా సమాచారం అందించింది. తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం మండలం ఊడిమూడి గ్రామానికి చెందిన పసుపులేటి సతీశ్‌.. ‘సేవ్‌ ద చైల్డ్‌ ఫ్యూచర్‌ ప్లాట్‌ఫాం’ ద్వారా ఇప్పటివరకు 83 గ్రామాలు, 22 గిరిజన ప్రాంతాల్లో పిల్లలకు విద్య, వైద్యంపై అవగాహన కల్పించినట్టు చెప్పాడు. కిడ్స్‌ రైట్స్‌ ఫౌండేషన్‌ ప్రపంచ దేశాల్లో పిల్లల జీవితాల్లో మార్పు, వారి హక్కుల కోసం పోరాటం, విద్య, వైద్యం ఇతర అవసరాల కోసం, సమాజంలో మార్పు తీసుకురావడానికి కృషిచేస్తున్న వ్యక్తులను గుర్తించి ఈ అవార్డు అందజేస్తుంటుంది. దీనికోసం ప్రపంచవ్యాప్తంగా 195 దేశాల నుంచి 29 మందిని గుర్తించి ‘చేంజ్‌మేకర్‌’ టైటిల్‌ను ప్రకటించింది. ఈ క్రమంలో భారత్‌ నుంచి ఈ టైటిల్‌ తనకు దక్కిన్నట్టు నాగసతీశ్‌ వివరించాడు. నవంబరు 13న నెదర్లాండ్స్‌లో ఆ సంస్థ టైటిల్‌ను అందించనుందని తెలిపాడు.

Updated Date - 2021-10-27T08:37:20+05:30 IST