మాస్కు లేకపోతే ఓటు వేయనియ్యవద్దు: ఎన్నికల కమిషనర్
ABN , First Publish Date - 2021-11-14T00:24:23+05:30 IST
ఓటర్లను మాస్కు లేకుండా పోలింగ్ స్టేషన్లో ఓటు వెయ్యడానికి
విజయవాడ: ఓటర్లను మాస్కు లేకుండా పోలింగ్ స్టేషన్లో ఓటు వెయ్యడానికి అనుమతించద్దని అధికారులను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని ఆదేశించారు. రాష్ట్రంలో ఆదివారం జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అధికారులతో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో మిగిలిపోయిన గ్రామ పంచాయతీలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలకు నిర్వహిస్తున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన కోవిడ్ నిబంధనలపై అధికారులకు నీలం సాహ్నిమార్గదర్శకాలు ఇచ్చారు. ఎన్నికల నిర్వహణలో అధికారులు గుమిగూడకూడదన్నారు.
కౌంటింగ్ సమయంలో కూడా కోవిడ్ నిబంధనలు పాటించాలని ఆదేశించారు. పోలింగ్కు ఒకరోజు ముందే పోలింగ్ స్టేషన్ను సానిటైజ్ చెయ్యాలని సూచించారు. పోల్, కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనే ప్రతి ఒకరు మాస్కు, సానిటైజరు ఉపయోగించాలన్నారు. కేంద్ర హోం శాఖ, రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన కోవిడ్ -19 నిబంధనలను పాటించాలన్నారు. పోలింగ్ స్టేషన్లో పోలింగ్ నిర్వహించే అధికారుల మధ్య భౌతిక దూరం పాటిస్తూ పోలింగ్ నిర్వహించాలని ఆమె ఆదేశించారు.