మాకేంటి..? అభ్యర్థుల ముందు అపార్ట్‌మెంట్ వాసుల ప్రతిపాదనలు

ABN , First Publish Date - 2020-11-26T18:56:19+05:30 IST

‘‘మా గేటెడ్‌ కమ్యూనిటీలో సుమారు 600 ఓట్లు ఉన్నాయి. అన్నీ మీకే గుద్దిస్తాం... మరి మాకేంటి’’ అని నిర్మొహమాటంగా అడుగుతున్నారు. లేదంటే ‘‘మా అపార్ట్‌మెంట్‌ కాంప్లెక్స్‌లో వాక్‌వే పాడైంది. సైకిల్‌ ట్రాక్‌ నిర్మాణం చేపట్టాలి. మీరేమైనా సహాయం చేస్తారా’’ అని కోరుతున్నారు.

మాకేంటి..? అభ్యర్థుల ముందు అపార్ట్‌మెంట్ వాసుల ప్రతిపాదనలు

అభ్యర్థుల ముందు అపార్ట్‌మెంట్‌లు, గేటెడ్‌ కమ్యూనిటీవాసుల ప్రతిపాదనలు


హైదరాబాద్‌ సిటీ ఆంధ్రజ్యోతి: ‘‘మా గేటెడ్‌ కమ్యూనిటీలో సుమారు 600 ఓట్లు ఉన్నాయి. అన్నీ మీకే గుద్దిస్తాం... మరి మాకేంటి’’ అని నిర్మొహమాటంగా అడుగుతున్నారు. లేదంటే ‘‘మా అపార్ట్‌మెంట్‌ కాంప్లెక్స్‌లో వాక్‌వే పాడైంది. సైకిల్‌ ట్రాక్‌ నిర్మాణం చేపట్టాలి. మీరేమైనా సహాయం చేస్తారా’’ అని కోరుతున్నారు. మధ్య తరహా అపార్ట్‌మెంట్‌లలో అయితే తమ సమస్యలను ఏకరువు పెట్టి పరిష్కరిస్తామని వాగ్దానం చేస్తేనే అంటూ మెలికలనూ పెడుతున్నారు. ఓటరులో చైతన్యం పెరిగిందా లేదంటే రాజకీయ వ్యవస్థ మీద నమ్మకం పోయిందా తెలీక ప్రజాస్వామ్యవాదులు ఆందోళన చెందుతున్నారు.


మీక్కావాల్సింది మా దగ్గరుంది..?

‘‘ఒకప్పుడు బస్తీలలో ఓటుకు వెయ్యి ఇచ్చారంటే అబ్బో అనుకునే వారం. వీళ్లకు ఏమీ తెలియదని బస్తీ ఓటర్లను తిట్టుకునే వారం. ఇప్పుడు వారే మా కన్నా తెలివైన వారనిపిస్తుంది. అన్నీ ఉచితంగా తీసుకుంటున్నారు. పైగా నోటు కూడా పొందుతున్నారు. మధ్యతరగతికి ఏం మిగిలింది... బూడిద. అడగలేము. ఏడ్వలేము అన్నట్లు ఉంది. ఇకనైనా మారాలని నిర్ణయించుకున్నాం. మా అపార్ట్‌మెంట్‌లో లిఫ్ట్‌ పాడైంది. దాన్ని బాగు చేయించమన్నాం. ఖర్చు 40 వేల రూపాయలు చెప్పాం. చూస్తాం.. అని వెళ్లిపోయారు రెండు ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు. ఓటింగ్‌ డే నాటికి ఫలితం వస్తుందనుకుంటున్నాం. మా అపార్ట్‌మెంట్‌ కాంప్లెక్స్‌లో 80 ఓట్లు ఉండడమే మా ధైర్యం’’ అన్నారు కేపీహెచ్‌బీకి చెందిన నారాయణరావు. ఇదే తరహా విధానాన్ని చింతల్‌, కూకట్‌పల్లి లాంటి ప్రాంతాలతో పాటుగా ఇటీవల వరదలకు నష్టపోయిన చాలా ప్రాంతాలలో అనుసరిస్తున్నారు. మీకు మా ఓటు కావాలి. మాకు మీ సహాయం కావాలి.. అని నిర్మొహమాటంగా అడుగుతున్నారు. 


అదిగో ఓటు... ఏదీ నోటు?

కొన్ని అపార్ట్‌మెంట్‌ కాంప్లెక్స్‌లు, గేటెడ్‌ కమ్యూనిటీలలో బేరసారం కొత్త పుంతలు తొక్కుతోంది. ఓ అపార్ట్‌మెంట్‌లో 10-20 ఓట్లు ఉంటే అది తమకు పెద్ద పట్టింపే కాదన్నట్లుగా ఎన్నికలలో పోటీపడుతున్న అభ్యర్థులు కనీసం వాటి వైపు తొంగి చూస్తున్న సంఘటనలు పెద్దగా ఉండటం లేదు కానీ, కనీసం 100 నుంచి 500 ఓట్లు తప్పనిసరిగా ఉంటాయనుకున్న చోట్ల మాత్రం అసోసియేషన్‌ అధ్యక్షులు, సెక్రటరీలతో మంతనాలు జరిపి ఓట్లు తమకే పడాలని కోరుతున్నారు. చింతల్‌లో ఓ సుప్రసిద్ధ సంస్థ నిర్మించిన అపార్ట్‌మెంట్‌ కాంప్లెక్స్‌లో గత ఎంఎల్‌ఏ ఎన్నికలప్పుడు 60 వేల రూపాయల వరకూ అధ్యక్షుడు, సెక్రటరీలు వసూలు చేశారని చెప్పారు అదే కాంప్లెక్స్‌లో నివాసముండే అభినవ్‌. ఎందుకు వసూలు చేశారో తమకు తెలియదంటూనే కాంప్లెక్స్‌ బాగుపడింది కూడా ఏమీ లేదన్నారు. అన్ని చోట్లా ఇదే రీతిలో లేదని, ఇప్పటికే తమ అపార్ట్‌మెంట్‌లో సభ్యులందరమూ మీటింగ్‌ పెట్టుకుని మరీ కనీస సౌకర్యాల కల్పన చేసిన వారికే ఓటేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు మణికొండలోని ఓ అపార్ట్‌మెంట్‌ వాసి అనిల్‌.

Updated Date - 2020-11-26T18:56:19+05:30 IST