11లోపే అపెక్స్ కౌన్సిల్కు సమయమివ్వాలి
ABN , First Publish Date - 2020-08-09T08:41:44+05:30 IST
రాష్ట్ర ప్రయోజనాలపై సీఎం కేసీఆర్కు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, ఏపీ సీఎం జగన్తో లోపాయికారి ఒప్పందమేదీ లేదని నిరూపించుకోవాలన్నా..
- జగన్ను ఒప్పించే బాధ్యత కేసీఆరే తీసుకోవాలి
- లేదంటే తెలంగాణద్రోహిగా మిగిలిపోతారు: సంజయ్
హైదరాబాద్, ఆగస్టు 8(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రయోజనాలపై సీఎం కేసీఆర్కు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, ఏపీ సీఎం జగన్తో లోపాయికారి ఒప్పందమేదీ లేదని నిరూపించుకోవాలన్నా.. 11వ తేదీలోగానే అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి సమయం ఇవ్వాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. లేని పక్షంలో తెలంగాణ ద్రోహిగా కేసీఆర్ చరిత్రలో మిగిలిపోతారని వ్యాఖ్యానించారు. తమ డిమాండ్ మేరకు కేసీఆర్ సమయమిఇచ్చినా.. ఏపీ సీఎం జగన్ ఇవ్వకపోవచ్చని, ఆయన్ను ఒప్పించే బాధ్యత కూడా కేసీఆరే తీసుకోవాలని అన్నారు. శనివారం ఇక్కడ సంజయ్ మీడియాతో మాట్లాడుతూ సుప్రీం కోర్టులో పిటిషన్ పేరుతో ఆలస్యం చేస్తూ టెండర్ల ప్రక్రియను ఈనెల 12నుంచి కొనసాగించేలా ఏపీ ప్రభుత్వానికి కేసీఆర్ పరోక్షంగా సహకరిస్తున్నారని ఆరోపించారు. సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో పోతిరెడ్డిపాడు టెండర్లను నిలిపివేయాలని ఎందుకు కోరలేదని ప్రశ్నించారు. నిబంధనలకు విరుద్ధంగా కృష్ణా జలాలను ఏపీ ప్రభుత్వం తరలించుకుపోతుంటే తెలంగాణ హక్కులు కాపాడడంలో సీఎం కేసీఆర్ విఫలమయ్యారని దుయ్యబట్టారు. ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టు పనులను వేగవంతం చేస్తుంటే.. కిందిస్థాయి అధికారులతో కేంద్రానికి లేఖలు రాయించి చేతులు దులుపుకొంటున్నారని మండిపడ్డారు. కేసీఆర్, జగన్ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని, కలిసి దోచుకోవడమే లక్ష్యంగా కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రయోజనాలు కాపాడాలంటూ కేంద్రానికి కేసీఆర్ ఎన్ని లేఖలు రాశాలో మంత్రి శ్రీనివా్సగౌడ్ చెప్పాలని సంజయ్ డిమాండ్ చేశారు. తమ విజ్ఞప్తి మేరకే కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటుపై రెండు రాష్ట్రాల సీఎంలకు లేఖలు రాశారని సంజయ్ తెలిపారు. తమ వినతిపై తక్షణమే స్పందించిన కేంద్ర మంత్రికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.