పలు స్మార్ట్ సిటీ పనులకు ఆమోదం
ABN , First Publish Date - 2021-06-19T06:17:41+05:30 IST
స్మార్ట్ సిటీ నిధులతో తిరుపతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను త్వరగా పూర్తిచేయాలని కలెక్టర్ హరినారాయణన్ అన్నారు.
తిరుపతి, జూలై 18 (ఆంధ్రజ్యోతి): స్మార్ట్ సిటీ నిధులతో తిరుపతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను త్వరగా పూర్తిచేయాలని కలెక్టర్ హరినారాయణన్ అన్నారు. కార్పొరేషన్ సమావేశం మందిరం నుంచి 23వ స్మార్ట్ సిటీ కార్యవర్గ సమావేశం శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగింది. రూ.2కోట్లతో గొల్లవానిగుంట స్టేడియంలో పెవిలియన్ నిర్మాణం, మరో రూ.2కోట్లతో బ్యాడ్మింటన్ కోర్టు నిర్మాణం, నంది సర్కిల్లో శ్రీవారి భక్తులకు అదనపు అంతస్తుల నిర్మాణం, రూ.40లక్షలతో వినాయకసాగర్లో మ్యూజికల్ వాటర్ ఫౌంటైన్ ఏర్పాటు, ఇంటింటి చెత్తసేకరణకు 18 కొత్త ఆటోల కొనుగోలుకు సమావేశం ఆమోదముద్ర వేసింది. కమిషనర్ గిరీష అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఏపీయూఎఫ్ఐడీసీ ఏడీ బసంత్కుమార్, అర్బన్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు, టీటీడీ జేఈవో భార్గవి, తుడా వీసీ హరికృష్ణ, ఇండిపెండెంట్ డైరెక్టర్లు రమాశ్రీ, డాక్టర్ రామచంద్రారెడ్డి వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు.