ఆప్సాస్కు 9,354మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులు
ABN , First Publish Date - 2020-07-04T10:03:01+05:30 IST
ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రతీ నెల ఒకటో తేదీన గ్రీన్ చానల్ ద్వారా వేతనాలు చెల్లిస్తామని రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరిత
నియామకపత్రాలు అందించిన హోం మంత్రి సుచరిత
గుంటూరు, జూలై 3 (ఆంధ్రజ్యోతి): ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రతీ నెల ఒకటో తేదీన గ్రీన్ చానల్ ద్వారా వేతనాలు చెల్లిస్తామని రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. శుక్రవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఏపీ కార్పొరేషన్ ఫర్ ఔట్సోర్స్డ్ సర్వీసెస్ కార్యకలాపాలను సీఎం ప్రారంభించారు. ఆ కార్యక్రమానికి కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా హోం మంత్రి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో అన్ని శాఖలు ఈ కార్పొరేషన్తో అనుసంధానం అవుతాయన్నారు. జిల్లాలో 76 శాఖలకు సంబంధించి 9,354 మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులను ఆప్కాస్కు బదలాయించామన్నారు. కలెక్టర్ శామ్యూల్ ఆనంద్కుమార్ మాట్లాడుతూ తొలి విడతలో 39 విభాగాలకు సంబంధించి 1,524 మందికి నియామకపత్రాలను అందించామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, మహమ్మద్ ముస్తఫా, ఉండవల్లి శ్రీదేవి, విడదల రజని, మద్ధాళి గిరిధర్, వి.లక్ష్మణరెడ్డి, జేసీ(సంక్షేమం) శ్రీధర్రెడ్డి పాల్గొన్నారు.