సీఎం జగన్ ఆదేశించారు.. కారణాలు తెలుసుకుంటాం: కృష్ణబాబు
ABN , First Publish Date - 2020-09-19T23:54:20+05:30 IST
రోడ్ల నిర్మాణం కోసం ప్రస్తుతం వేసిన టెండర్లను రద్దు చేసి మళ్లీ టెండర్కు వెళ్లాలని సీఎం ఆదేశించారని ఆర్అండ్బీ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు అన్నారు. అర్హత విషయంలో...
విజయవాడ: రోడ్ల నిర్మాణం కోసం ప్రస్తుతం వేసిన టెండర్లను రద్దు చేసి మళ్లీ టెండర్కు వెళ్లాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారని ఆర్అండ్బీ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు అన్నారు. అర్హత విషయంలో చాలా కంపెనీలు ఉన్నా 14 కంపెనీలే టెండర్ వేయడానికి కారణం తెలుసుకుంటామని ఆయన తెలిపారు. ప్రస్తుత టెండర్లకు తక్కువ స్పందన వచ్చినందున రీటెండరింగ్ నిర్వహిస్తున్నామన్నారు. ప్రాజెక్టు టెండర్లను ఎవరైనా అడ్డుకుంటే చర్యలు తప్పవని కృష్ణబాబు హెచ్చరించారు.
25 టెండర్ బిడ్లు మాత్రమే వచ్చాయని కృష్ణబాబు వెల్లడించారు. ప్రపంచ బ్యాంక్ నియమాల ప్రకారం గత రెండేళ్లలో ఒక కంపెనీ రూ.100 కోట్ల టర్నోవర్ కలిగి ఉండాలని, కాంట్రాక్టర్కు త్వరగా పనులు పూర్తి చేసే సామర్థ్యం ఉండాలని స్పష్టంచేశారు. ఎక్కువ మంది టెండర్లో పాల్గొంటేనే ఎక్కువ అభివృద్ధి అని అభిప్రాయపడ్డారు. పారదర్శకత కోసమే జ్యుడీషియల్ ప్రివ్యూ కమిషన్, రివర్స్ బిడ్డింగ్ అని చెప్పారు. అర్హత ఉన్న కాంట్రాక్టర్లతో సంప్రదించాలని ఇంజినీర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు కృష్ణబాబు తెలిపారు.