కొవిడ్ స్పెషల్ డ్రైవ్ ఉద్యోగులు ఇంటికేనా?
ABN , First Publish Date - 2021-10-31T06:24:58+05:30 IST
కరోనా కష్టకాలంలో వైద్య సేవలు అందించిన కొవిడ్-19 స్పెషల్ డ్రైవ్ ఉద్యోగులు ఇంటిబాట పట్టనున్నారా. మూడు నెలలుగా వీరి సర్వీసును రెన్యూవల్ చేయకపోవడం, విధులకు హాజరుకావాల్సిన అవసరం లేదని వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతస్థాయి ఉద్యోగి స్వయంగా ఫోన్ చేసి చెప్పడంతో వారంతా ఆందోళనకు గురవుతున్నా రు.
రెన్యూవల్కాని ఉద్యోగాలు
ఐదు నెలలుగా వేతనాలు కరువు
ఆందోళనలో ఉద్యోగులు
నల్లగొండ అర్బన్, అక్టోబరు 30: కరోనా కష్టకాలంలో వైద్య సేవలు అందించిన కొవిడ్-19 స్పెషల్ డ్రైవ్ ఉద్యోగులు ఇంటిబాట పట్టనున్నారా. మూడు నెలలుగా వీరి సర్వీసును రెన్యూవల్ చేయకపోవడం, విధులకు హాజరుకావాల్సిన అవసరం లేదని వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతస్థాయి ఉద్యోగి స్వయంగా ఫోన్ చేసి చెప్పడంతో వారంతా ఆందోళనకు గురవుతున్నా రు. కరోనా క్లిష్ట పరిస్థితుల్లో ధైర్యంగా ముందుకు వచ్చి వీరు ఏడాదికిపైగా వైద్య సేవలు అందించారు. ప్రస్తు తం ఉద్యోగులు ఉంటాయో లేదో తెలియని ఆందోళనలో వీరున్నారు.
రెన్యూవల్ కాని ఉద్యోగాలు
కరోనా సమయంలో కొవిడ్-19 స్పెషల్ డ్రైవ్ కింద ఎన్హెచ్ఎం స్కీమ్లో గత ఏడాది జూలై నెలలో కొంతమందిని తాత్కాలిక ప్రాతిపదికన వైద్య ఆరోగ్యశాఖ నియమించింది. అందులో వైద్యులు, ల్యాబ్ టెక్నీషియన్లు, స్టాఫ్ నర్సులు, కంప్యూటర్ ఆపరేటర్లు, పేషంట్ కేర్ టేకర్లు, అంబులెన్సు డ్రైవర్లు మొత్తం 35 మంది ఉన్నారు. వీరంతా జిల్లా జనరల్ ఆస్పత్రిలో వైద్య సేవలు అందజేశారు. తొలుత మూడు నెలల కా లానికి మాత్రమే వీరికి ఒప్పందం పత్రం ఇవ్వగా, ఆ తరువాత మరో మూడు నెలలు రెన్యూవల్ చేశారు. ఇలా రెండుసార్లు రెన్యూవల్ చేశారు. అయితే సెప్టెంబరు నెలనుంచి ఇప్పటి వరకు వీరిని రెన్యూవల్ చేయలేదు. అయితే వీరు మాత్రం యథావిధిగా విధు లు నిర్వహిస్తూనే ఉన్నారు. మొత్తం ఐదు నెలలకు సంబంధించిన వేతనాలు వీరికి చెల్లించాల్సి ఉంది.
ఆందోళనలో ఉద్యోగులు
ఉద్యోగాలు రెన్యూవల్ చేయకపోగా విధుల నుంచి తొలగిస్తున్నట్లు సంబంధిత అధికారుల నుంచి సమాచారం వస్తుండటంతో వీరు ఆందోళన చెందుతున్నారు. కరోనా కష్టకాలంలో ప్రజలకు సేవలందించామని, ఇప్పుడు విధుల నుంచి తొలగించడం ఎంత వరకు సమంజసమని వీరు ప్రశ్నిస్తున్నారు. తమను వెంటనే రెన్యూవల్ చేయాలని, లేదా నూతనంగా భర్తీ చేసే ఉద్యోగాల్లో తీసుకోవాలని వీరు కోరుతున్నారు. ఇదిలా ఉండగా, ఈ విషయమై ఉన్నతాధికారులను సంప్రదించగా, వీరిని విధుల నుంచి తొలగించాలా లేదా అనే విషయం కలెక్టర్ నిర్ణయం మేరకు ఉంటుందని తెలపడం గమనార్హం.