గుట్కా గుట్టు రట్టు
ABN , First Publish Date - 2021-10-24T04:43:28+05:30 IST
నగరంలోని రైలుపేటలో గల మూడు అంతస్థుల భవనంలో ఓ గుట్కా తయారీ రాకెట్ను ఎస్ఈబీ బృందాలు గుర్తించాయి
తయారీ కేంద్రంపై ఎస్ఈబీ బృందాల దాడి
పెద్ద మొత్తంలో టుబాకో ముడిసరుకు, మెషిన సీజ్
గుంటూరు, అక్టోబరు 23: నగరంలోని రైలుపేటలో గల మూడు అంతస్థుల భవనంలో ఓ గుట్కా తయారీ రాకెట్ను ఎస్ఈబీ బృందాలు గుర్తించాయి. శనివారం ఎస్ఈబీ జాయింట్ డైరెక్టర్ బిందుమాధవ్ ఆధ్వర్యంలో అధికారులు, సిబ్బంది ఆ ఇంటిపై దాడి చేశారు. కొందరు కూలీలను పెట్టుకుని పెద్దఎత్తున గుట్కా ప్యాకెట్లను తయారు చేస్తున్నట్టు గుర్తించారు. అక్కడ గుట్కా ప్యాకింగ్ మిషన, 880 టుబాకో డబ్బాలు, 1,050 బాబా, రత్న టుబాకో ప్యాకెట్లు, 80 కిలోల టుబాకో ముడి సరుకు, పెద్దఎత్తున గుట్కా ప్యాకెట్లను ఒక టీవీఎస్ వాహనాన్ని కూడా సీజ్ చేశారు. వీటి మొత్తం ఖరీదు రూ.5,57,730 ఉంటుందని అధికారులు అంచనా వేశారు. దీనిని ఓబుల్శెట్టి హరిబాబు అనే వ్యక్తి నిర్వహిస్తున్నట్టు అధికారుల విచారణలో తేలింది. అయితే పోలీసులు దాడి చేసిన సమయంలో హరిబాబు అక్కడ లేడు. గుట్కాలు తయారు చేస్తున్న కె.సురేష్బాబు, ఎస్కే నజ్రీన, ఎస్కే హుస్సేనబీ తదితరులను అదుపులోకి తీసుకున్నారు. దాడిలో గుంటూరు ఎస్ఈబీ సూపరింటెండెంట్ మణికంఠతోపాటు ఇనస్పెక్టర్, మహిళా సిబ్బంది పాల్గొన్నారు.