Armugaswami కమిటీకి స్థలం కేటాయింపు

ABN , First Publish Date - 2021-12-01T15:03:30+05:30 IST

మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతిపై విచారణ జరుపుతున్న హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఆర్ముగ స్వామి కమిటీకి అనువైన స్థలాన్ని కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీ

Armugaswami కమిటీకి స్థలం కేటాయింపు

                    - జయ మృతి కేసు తీర్పు వాయిదా


చెన్నై: మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతిపై విచారణ జరుపుతున్న హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఆర్ముగ స్వామి కమిటీకి అనువైన స్థలాన్ని కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీ నిర్వహిస్తున్న కార్యాలయం వంటగదిలా వుందని, కమిటీకి అనువైన విశాలమైన స్థలాన్ని కేటాయించాలని సుప్రీంకోర్టు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. ఆ మేరకు చెన్నై మెరీనాబీచ్‌ ఎళిలగమ్‌ సమీపంలోని కలశా మహల్‌లో 700 చదరపుటడుగుల విస్తీర్ణం కలిగిన స్థలాన్ని కార్యాలయం కోసం ప్రభుత్వం కేటాయించింది. ఇకపై ఆర్ముగస్వామి కమిటీ అక్కడ విధులు నిర్వహిస్తుందని ప్రభుత్వం పేర్కొంది.


అపోలో కేసు తీర్పు వాయిదా

జస్టిస్‌ ఆర్ముగస్వామి కమిటీని రద్దు చేయాలంటూ అపోలో ఆస్పత్రుల యాజమాన్యం దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పును సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఆ కమిటీలో వైద్యనిపుణులు సభ్యులుగా లేకపోవడం వల్ల తమ ఆస్పత్రి జయలలితకు అందించిన చికిత్సపై అనుమానాలు కలిగేలా కమిటీ విచారణ జరుపుతోందని ఆరోపిస్తూ సుప్రీంకోర్టులో అపోలో గ్రూపు పిటిషన్‌ వేసిన విషయం తెలిసిందే. జయలలిత మృతికి సంబంధించి రాజకీయ నాయకులు పలువురిని విచారించాల్సిన జస్టిస్‌ ఆర్ముగస్వామి కమిటీ అదే పనిగా తమ ఆస్పత్రి వైద్యులు, సిబ్బందిని విచారణ జరుపుతోందని ఆ పిటిషన్‌లో ఆరోపించింది. ఆ కమిటీలో వైద్యనిపుణులను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసింది. ఈ పిటిషన్‌పై విచారణ జరిగినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది హాజరై ఆ కమిటీలో ఎయిమ్స్‌ ఆస్పత్రి వైద్యనిపుణులను సభ్యులుగా చేర్చేందుకు సిద్ధంగా ఉందని, అవసరమైతే జస్టిస్‌ ఆర్ముగస్వామితోపాటు మరో మాజీన్యాయమూర్తిని కూడా కమిటీలో చేర్చేందుకు చర్యలు తీసుకుంటుందని వివరించారు. అయితే కమిటీలో మరో మాజీ న్యాయమూర్తిని చేర్చటానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ పిటిషన్‌ మంగళవారం మళ్ళీ విచారణకు రాగా, కమిటీ విచారణ జరపాల్సిన సాక్షుల జాబితాను సమర్పించాలని ఉత్తర్వులు జారీ చేసింది. కమిటీకి ఏర్పాటు కానున్న కొత్త కార్యాలయాన్ని కోర్టు గదిలా తీర్చిదిద్దాలని కూడా ఆదేశించింది. ఆ తర్వాత ఈ పిటిషన్‌పై అన్ని పక్షాల వాదప్రతివాదనలు ముగియడంతో తీర్పును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.

Updated Date - 2021-12-01T15:03:30+05:30 IST