రేపు గ్రేటర్ కౌంటింగ్కు ఏర్పాట్లు పూర్తి
ABN , First Publish Date - 2020-12-03T16:49:42+05:30 IST
శుక్రవారం గ్రేటర్ కౌంటింగ్ జరగనున్న నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రాల దగ్గర భారీ భద్రతను ఏర్పాటు చేశారు.
హైదరాబాద్: ఈనెల 1వ తేదీన జీహెచ్ఎంసీ ఎన్నిక పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. అయితే శుక్రవారం గ్రేటర్ కౌంటింగ్ జరగనున్న నేపథ్యంలో ఆయా కౌంటింగ్ కేంద్రాల దగ్గర భారీ భద్రతను ఏర్పాటు చేశారు. శుక్రవారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. గ్రేటర్ 150 డివిజన్లకు సంబంధించి కౌంటింగ్ జరగనుంది. అయితే ఆయా కౌంటింగ్ కేంద్రాల్లోకి అభ్యర్థులతోపాటు వాళ్ల ఏజెంట్లను మాత్రమే అనుమతి ఉంటుందని అధికారులు తెలిపారు.
లెక్కింపు ఇలా...
వార్డుకు ఒకటి చొప్పున 150 కౌంటింగ్ హాళ్లు ఏర్పాటు చేశారు. ఒక్కో హాలులో 14 టేబుళ్లపై ఓట్ల లెక్కింపు ఉంటుంది. ముందుగా పోలింగ్ కేంద్రాల వారీగా పోలైన ఓట్లను బాక్సుల్లో నుంచి తీసి 25 బ్యాలెట్ల చొప్పున బండిల్గా కడతారు. ఇదే సమయంలో ఆ కేంద్రంలో పోలైన ఓట్లకు సమానంగా ఉన్నాయా, లేదా, అన్నది పరిశీలిస్తారు. ఒక కేంద్రంలో 610 ఓట్లు పోలయ్యాయనుకుంటే, 25 చొప్పున 24 బండిల్స్(600) కట్టిన అనంతరం 10 ఓట్లు మిగులుతాయి. వాటిని పక్కన పెడుతారు. ఇలా ప్రతి పోలింగ్ కేంద్రంలో 25 చొప్పున బండిల్స్ కట్టిన అనంతరం.. మిగిలే ఓట్ల (25లోపు ఉంటే)ను ఓ ట్రేలో వేసి, తర్వాత వాటిని బండిల్స్గా కడతారు. వార్డు పరిధిలోని అన్ని ఓట్లను బండిళ్లుగా కట్టిన అనంతరం.. ఒక డ్రమ్ములో వేసి కలుపుతారు. ఏ పోలింగ్ కేంద్రంలో ఎవరికి ఎన్ని ఓట్లు పోలయ్యాయనే వివరాలు తెలియకూడదనే ఇలా చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రక్రియ పూర్తవడానికి రెండు నుంచి రెండున్నర గంటలు పట్టే అవకాశముంది. ఆ తర్వాతే లెక్కింపు మొదలవుతుంది.
మొదటి రౌండ్ వివరాల వెల్లడి 11 గంటల తర్వాతే ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఒక్కో టేబుల్కు 1,000 ఓట్లు (40 బండిల్స్) లెక్కిస్తారు. అంటే ఒక్కో రౌండ్లో 14 వేల ఓట్ల లెక్కింపు జరుగుతుంది. రౌండ్ల వారీగా ఓట్ల లెక్కింపు జరుగుతుంది. మొత్తం ఓట్ల లెక్కింపు పూర్తయిన అనంతరం విజేతను ప్రకటిస్తారు. గుర్తు ఆధారంగా ఓట్లను ఒక్కో డబ్బాలో వేస్తారు. అనంతరం వాటిని లెక్కించి ఏ అభ్యర్థికి ఎన్ని వచ్చాయన్నది తేలుస్తారు. కౌంటింగ్ కేంద్రంలో ఉండే ఏజెంట్లు కోరితే మరోసారి ఓట్లు లెక్కించాల్సి ఉంటుంది. ఒక్కో టేబుల్కు కౌంటింగ్ సూపర్వైజర్, అసిస్టెంట్, అడిషనల్ కౌంటింగ్ సూపర్వైజర్లు ఉంటారు. వార్డు రిటర్నింగ్ ఆఫీసర్ లెక్కింపు ప్రక్రియను పర్యవేక్షిస్తారు. రిటర్నింగ్ అధికారి వద్ద, అభ్యర్థితోపాటు ఒక కౌంటింగ్ ఏజెంట్ ఉండే అవకాశం ఉంటుంది. ఇతర ఏజెంట్లు పక్కన ఉండి లెక్కింపును పరిశీలించవచ్చు.
కేవలం 11,818 ఓట్లు పోలైన మెహిదీపట్నం వార్డు ఫలితం మొదట వెలువడే అవకాశం ఉంది. ఒక్కో రౌండ్కు 14 వేల ఓట్లు లెక్కించే అవకాశం ఉండగా, అంతకంటే తక్కువ ఓట్లున్న ఈ డివిజన్ ఫలితం త్వరగా వస్తుందని అధికారులు చెబుతున్నారు. గ్రేటర్లోని మెజార్టీ వార్డుల్లో 15 నుంచి 27 వేల వరకు ఓట్లు పోలైన నేపథ్యంలో రెండు రౌండ్లలో లెక్కింపు పూర్తవుతుంది. 28 వేల కంటే ఎక్కువ ఓట్లు పోలైన వార్డుల్లో మూడు రౌండ్ల కౌంటింగ్ జరుగుతుంది. అత్యధికంగా 37,445 ఓట్లు పోలైన మైలార్దేవ్పల్లి ఫలితం ఆలస్యంగా వెలువడే అవకాశముంది. దీంతోపాటు సుభా్షనగర్ (33,191), గాజుల రామారం (30,485), అల్లాపూర్ (30,485), బన్సీలాల్పేట (29,670), తార్నాక (29,490), సీతాఫల్మండి (29,443) వార్డుల్లో మూడు రౌండ్ల ఓట్ల లెక్కింపు జరుగనుంది.