నారద కుంభకోణంలో మమతా సర్కారు మంత్రి అరెస్ట్
ABN , First Publish Date - 2021-05-17T18:22:16+05:30 IST
నారద కుంభకోణం కేసులో పశ్చిమ బెంగాల్ మంత్రి ఫిర్హాద్ హకీంను...
కోల్కతా: నారద కుంభకోణం కేసులో పశ్చిమ బెంగాల్ మంత్రి ఫిర్హాద్ హకీంను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఫిర్హాద్ హకీం... మమతా బెనర్జీ కేబినెట్లో రవాణాశాఖ మంత్రి. ఫిర్హద్తోపాటు ఈ కేసులో నేతలు మదన్ మిత్రా, సుబ్రతా ముఖర్జీ, సోవన్ చటర్జీలపై అనేక ఆరోపణలు ఉన్నాయి. ఈ ఉదంతంలో అప్పటి తృణమూల్ కాంగ్రెస్ నేత, నేటి బీజేపీ ఎమ్మెల్యే సువేందు అధికారిపై విచారణకు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అనుమతినిచ్చారు.
ఈ కుంభకోణం విషయానికొస్తే....2014లో ఓ వ్యక్తి తాను బడా వ్యాపారవేత్తనంటూ... పశ్చిమ బెంగాల్లో పెట్టుబడులు పెడతానంటూ, ఏడుగురు తృణమూల్ ఎంపీలు, నలుగురు మంత్రులు, ఓ ఎమ్మెల్యేను కలిశారు. ఈ నేపధ్యంలో వారికి కొంత డబ్బు ఇచ్చినట్టు ఆడియో టేపులు బయటకు వచ్చి, సంచలనం సృష్టించాయి. 2016 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ టేపుల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. అయితే నాటి ఎన్నికల్లో టీఎంసీ విజయం సాధించడంతో ఈ కుంభకోణం మరుగున పడింది. తాజాగా ఈ టేపుల వ్యవహారం తెరపైకి వచ్చింది. పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్కర్ ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించారు. దీంతో ఈ ఉదంతం ఆసక్తికరంగా మారింది.